చేతకానితనం కాదు, మోడీ సిద్ధమయ్యారు: పాక్కు అమెరికా మీడియా షాకింగ్ హెచ్చరిక
వాషింగ్టన్: యూరీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రమంగా ఏకాకి అవుతోంది. ఇప్పటికే సార్క్ దేశాలు దాదాపు ఏకమయ్యాయి. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. తాజాగా, అమెరికా మీడియా కూడా పాకిస్తాన్ను హెచ్చరించింది.
మోడీకి ప్రశంసలు
అదే సమయంలో, భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించింది. ప్రధాని మోడీ నిగ్రహాన్ని అలసత్వంగా తీసుకోవద్దని, ఇలాగే చాలాకాలం ఉంటే నష్టమని అమెరికా ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పాకిస్తాన్ను హెచ్చరించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరిక
భారత్ నిగ్రహాన్ని పాకిస్తాన్ సరిగా అర్థం చేసుకోక, చేతకానితనంగా భావిస్తే అది అంతర్జాతీయంగా ఏకాకి అయ్యే ప్రమాదం ఉందని అమెరికా మీడియా హెచ్చరించింది. యూరి ఘటన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే సైనిక చర్యకు దిగక ఎంతో సహనం పాటిస్తున్నారని ప్రశంసించింది.
ఇలాగైతే యుద్ధమే
అయితే, భారత్ వ్యూహాత్మక సహనం అన్ని వేళలా పని చేయదని పాకిస్తాన్ గ్రహించాలని హితవు పలికింది. పాక్ మరిన్ని ఉగ్రదాడులకు దిగితే భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అమెరికా మీడియా అంచనా వేసింది.
పాక్కు బుద్ధి చెప్పేందుకు మోడీ సిద్ధమయ్యారు
భారత ప్రధాని మోడీ సైనిక చర్యకు బదులు పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అంతేకాక ఇండస్ వాటర్ నిలుపుదల, ఆ దేశంతో వాణిజ్య సంబంధాల రద్దుతో పాక్కు ఊహించని విధంగా బుద్ది చెప్పేందుకు మోడీ సిద్ధమయ్యారని ఆ పత్రిక అభిప్రాయపడింది. ఇప్పటికైనా పాక్ ఉగ్రవాదాన్ని వీడి మోడీకి సహకరించాలని సూచించింది. లేదంటే అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని వెలివేసే పరిస్థితి రావొచ్చునని అమెరికా మీడియా హెచ్చరించింది.