కలాంకు అమెరికన్ మీడియా నివాళి: ప్రత్యేక కథనాలు
వాషింగ్టన్: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతిపై అగ్రరాజ్యం అమెరికా తన ప్రగాడ సంతాపాన్ని తెలియజేసింది. భారత్ను అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరని అమెరికన్ మీడియా ప్రశంసించింది.
'మ్యాన్ ఆఫ్ మిసైల్' అబ్దుల్ కలాం మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అణ్వస్త్ర, అంతరిక్ష రంగాల్లో భారత్ అభివృద్ధికి కలాం చేసిన విశిష్ట సేవలందించారని తమ కథనాల్లో పేర్కొన్నాయి.
రక్షణ రంగంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగడానికి అబ్దుల్ కలాం అవిశ్రాంత కృషి చేశారని 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది. విదేశీ సాయం లేకుండా భారత్ సొంతంగా అణుబాంబులు తయారు చేయగల నైపుణ్యం సాధించిందని 'న్యూయార్క్ టైమ్స్' ఓ కథనం ప్రచురించింది.
అణ్వాయుధాలను తీసుకెళ్లగల పృధ్వీ, అగ్ని లాంటి క్షిపణలను రూపొందించడం ద్వారా భారత్ రక్షణ వ్యవస్ధను కలాం పటిష్టం చేశారని 'వాషింగ్టన్ పోస్ట్' ఓ కథనంలో పేర్కొంది.
భారత అంతరిక్ష, రక్షణ రంగాల పటిష్టతకు అబ్దుల్ కలాం ఎనలేని సేవలు చేశారని 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివాళులర్పిస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది.
మాజీ భారత రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఐఐఎంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కలాంను షిల్లాంగ్లోని ఎస్పీ ఖాసీ హిల్స్లోని ఎం ఖర్కరంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కలాం మరణించిన సంగతి తెలిసిందే.
భారతదేశం 11వ రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. మిస్సైల్ మ్యాన్గా ఆయన ప్రఖ్యాతి వహించారు. ఆయన మృతికి వారం రోజుల పాటు భారత ప్రభుత్వం సంతాపదినాలను ప్రకటించింది. అబ్దుల్ కలాం మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.