నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్: మాటల్లేవు, మర్యాదల్లేవు
ఖాట్మండు: పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయనే విషయం నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన 18వ సార్క్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. పాకిస్తాన్ ప్రధాని నవాబ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మాటలు లేవు. మూడు గంటలకు పైగా జరిగిన కార్యక్రమంలో వారి మధ్య రెండు సీట్ల దూరమే ఉన్నప్పటికీ ఒకరి వైపు ఒకరు చూసుకోలేదు.
ఇరువుపు మర్యాదకైనా పలకరించుకోలేదు. కరచాలనం చేసుకోలేదు. ఒకరినొకరు పట్టించుకోలేదు. ఖాట్మండులో బుధవారం ప్రారంభమైన సార్క్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎడమొహం, పెడమొహం అనే రీతిలో వ్యవహరించారు. నవాజ్ షరీఫ్ ప్రసంగం ముగించుకుని తన సీటు దగ్గరకు మోడీని దాటుకుని వెళ్లినప్పుడు కూడా ఇద్దరి నేతల చూపులు కలవలేదు. షరీఫ్ తన ప్రసంగం చేయడానికి కదిలిపోతుండగా అటువైపు కూడా చూడకుండా మోడీ బుక్లెట్ చూస్తూ కనిపించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత దేశాధినేతలను హోల్డింగ్ రూంలో సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే మోడీ, కొయిరాల చాలా సేపు వేదిక మీదనే ఇరువురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత వీరివురు హోల్డింగ్ రూంలోకి వెళ్లారు. అక్కడ కూడా మోడీ, షరీఫ్ కలుసుకునే అవకాశం కలగలేదు.
గత నెలలో కాశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ సేనలు అనేకసార్లు ఉల్లంఘించినట్లుగా భారత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. భారత్, పాక్ నేతల మధ్య లాంఛనప్రాయ భేటీ ఏమీ లేకపోయినా, వారిద్దరూ ఒకే సమావేశంలో పాల్గొంటున్నందున కనీసం మర్యాదకైనా కరచాలనం చేసుకుని పలకరించుకుంటారని అనుకున్నారు.
భారత్ ఏకపక్షంగా వ్యవహరించి ద్వై పాక్షిక చర్చలకు గండి కొట్టిందంటూ నవాజ్ షరీఫ్ మంగళవారం భారతదేశంపైనే నిందమోపారు. ఇదిలా ఉండగా, భారత, పాక్ ప్రధానుల మధ్య పూర్తిస్థాయి సమావేశం జరిగే అవకాశం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.
ఇలాంటి విజ్ఞప్తి తమకు పాక్ నుంచి అందలేదని, అందువల్ల ఇలాంటి పక్కా సమావేశం జరిగే అవకాశమేదీ లేదన్నారు. దీనిపై పాకిస్థాన్ వెంటనే స్పందించింది. ఉభయ దేశాల ప్రధానుల మధ్య భేటీకి ఇప్పట్లో అవకాశం లేదని స్పష్టం చేసింది. కాగా, సార్క్ దేశాల నేతలతో ప్రధాని విడివిడిగా భేటీ అయ్యారు.