శ్వేతసౌధంలోకి నో ఎంట్రీ.. వ్యతిరేక మీడియాపై కసి తీర్చుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకున్నారు. పలు మీడియా సంస్థలను శ్వేతసౌధంలో రోజూ జరిగే ప్రెస్ బ్రీఫింగ్ కు రాకుండా నిషేధం విధించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లూ మీడియా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆయన ఈసారి ఏకంగా పలు మీడియా సంస్థలను శ్వేతసౌధంలో రోజూ జరిగే ప్రెస్ బ్రీఫింగ్ కు రాకుండా నిషేధం విధించారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశం నుంచి సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ సహా పలు మీడియా సంస్థలను మినహాయించారు. శుక్రవారం ప్రెస్ బ్రీఫింగ్ గదిలో ఆన్-కెమెరా సమావేశం కాకుండా ఆఫ్-కెమెరా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వైట్ హౌస్ నుంచి కొని్న మీడియా సంస్థలకు మాత్రమే ఆహ్వానం అందింది. ప్రముఖ మీడియా సంస్థలైన సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజిల్స్ టైమ్స్ తోపాటు మరికొన్ని వార్తా సంస్థలను వైట్ హౌస్ ఆహ్వానించలేదు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశానికి బ్రైబర్ట్, ది వాషింగ్టన్ టైమ్స్, ఏబీసీ, సీబీఎస్, ఎన్ బీసీ, ఫాక్స్, రాయిటర్స్, బ్లూమ్ బర్గ్ తదితర వార్తా సంస్థలను మాత్రమే ఆహ్వానించారు. గతంలో ఎక్కువగా ఆన్-కెమెరా మీడియా సమావేశాలు జరిగేవి.
అయితే ప్రతిరోజూ ప్రతి విషయంలో ఆన్-కెమెరా సమావేశం అవసరం లేదని, కొన్ని ఆఫ్-కెమెరా మీడియా సమావేశాలు నిర్వహిస్తామని సీన్ స్పైసర్ తెలిపారు. కొన్ని వార్తా సంస్థలను మీడియా సమావేశానికి ఆహ్వానించలేదని తెలుసుకున్న తరువాత రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, టైమ్ మ్యాగజైన్లు నిరసనగా ప్రెస్ బ్రీఫింగ్ నుంచి వాకౌట్ చేశాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నోసార్లు మీడియాను తీవ్రంగా దూషిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ప్రజలకు మీడియానే శత్రువు అని, తనపై తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. తప్పుడు వార్తలు రాసే మీడియాకు మాత్రమే తాను వ్యతిరేకమని ఇటీవల పేర్కొన్నారు.