ఆ విషయంలో వెనుకాడేది లేదు.. : పాక్కు అమెరికా షాక్
వాషింగ్టన్ : పాక్ కు మిత్ర దేశంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా.. ఉగ్రవాదం విషయంలో మాత్రం పాక్ నిర్ణయంతో పనిలేకుండా ఒంటరిగా పోరు చేయడానికైనా సిద్దమంటూ ప్రకటించింది. పాక్ లోని ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు.. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించిన అమెరికా.. అవసరమైతే ఒంటరిగానే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది.
ఉగ్రవాదుల ఆర్థిక కార్యకలాపాలను నిరోధించే శాఖలో కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆడమ్ జుబిన్.. తాజాగా పాక్ కు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఆధునిక అంతర్జాతీయ అధ్యయనాల సంస్థ అయిన పౌల్ హెచ్ నిట్జే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈవిధంగా స్పందించారు. ఉగ్రవాదులపై పాక్ ఉదాసీన వైఖరిని ఈ సందర్బంగా జుబిన్ తప్పుబట్టారు.
అన్ని ఉగ్రవాద సంస్థలపై ఒకేవిధమైన అణిచివేత చర్యలు చేపట్టకుండా.. కొన్నింటికి మాత్రం మినహాయింపునిచ్చే రీతిలో పాక్ ధోరణి ఉన్నట్లుగా ఆయన ఆరోపించారు. పాకిస్థాన్లోని అమెరికా రాయబారుల ద్వారా ఉగ్రవాద నెట్వర్క్లను వెంటాడే ప్రయత్నాలు కొనసాగిస్తామని జుబిన్ పేర్కొనడం గమనార్హం.
ఉగ్ర చర్యలను అడ్డుకోవడంలో పాక్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఒకవేళ పాక్ గనుక ఇందుకు సహకరించబోయినా.. తమ నెట్ వర్క్ ను ధ్వంసం చేయాలని యోచించినా.. ఒంటరిగా చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాక్ తో అమెరికా భాగస్వామ్యం కొనసాగుతుందని అమెరికా పేర్కొంది.