ప్రపంచంలో పొడవైన రైలు సొరంగం
స్విట్జర్లాండ్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ (రైలు సొరంగం) పనులు పూర్తి అయ్యాయి. దాదాపు 20 సంవత్సరాల పాటు ఎంతో శ్రమించిన కార్మికులు స్విట్జర్లాండ్ లో ఈ రైలు టన్నెల్ నిర్మించారు.
భూమి ఉపరితలానికి ఎనిమిదివేల అడుగుల లోతున ఈ రైలు సొరంగాన్ని నిర్మించి రికార్డు సృష్టించారు. నీట్ గొథర్డ్ బేస్ టన్నెల్ గా దీనిని పిలుస్తున్నారు. 1996వ సంవత్సరంలో ఈ రైల్వే టన్నెల్ పనులు ప్రారంభించారు.
కఠిన శిలలు గల పర్వత ప్రాంతాలలో నిర్మించడం వలన దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. 57 కిలో మీటర్ల పొడవైన ఈ రైల్వే టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగంగా గుర్తింపు పొందింది. జురిచ్ నుంచి మిలాన్ నగరానికి ఈ రైలు మార్గం ఎర్పాటు చేశారు.
గంటకు 240 కిలో మీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుందని స్విస్ రైల్వే వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అన్ని సాంకేతిక పనులు పూర్తి అయ్యాయని అధికారులు అన్నారు. అక్టోబర్ ఒకటవ తేది నుండి ట్రయల్ రన్స్ నిర్వహించడానికి ఎర్పాట్లు చేశారు.
2016 జనవరి నెలలో ముందుగా ఎంపిక చేసిన వెయ్యి మంది ప్రయాణికులతో తొలిసారిగా రైలు సంచరిస్తుంది. తరువాత 2016 జూన్ 1వ తేది అధికారికంగా రైలు సొరంగం ప్రారంభిస్తామని స్విస్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైల్వే టన్నెల్ కు రూ. 65 వేల కోట్లు ఖర్చు చేశారు. రోజుకు రెండు వేల మంది కార్మికులు పని చేశారు.
ప్రస్తుతం ప్రపంచంలో అతి పొడవైన రైల్వే టన్నెల్ జపాన్ లో ఉంది. సికాన్ టెన్నల్ గా పలిచే ఈ రైలు సొరంగం 24 కిలో మీటర్లు ఉంటుంది. జపాన్ లో హోన్టు-హోక్కాయిడో నగరాల మద్య రైల్వే టెన్నల్ నిర్మించారు.