‘భారత్ కోసం మోడీ ఉన్నారు: పాక్కు దిక్కేది?’
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ నుంచి ఒక రకమైన ప్రశంసలు అందాయి. అదే సమయంలో ఆ దేశ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ రాజకీయ విశ్లేషకుడు, భారత్ను అమితంగా ద్వేషించే జైద్ హమీద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుక్షణం దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తుంటే.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాపార దందాల్లో మునిగితేలుతున్నారని పాక్లోని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జైద్ హమీద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాక్లోని ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన షరీఫ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారురు.
అదేస్థాయిలో నరేంద్ర మోడీ పనితీరుపైనా, భారత ప్రధాని విదేశాంగ విధానంలో చూపుతున్న దూకుడు గురించి ప్రశంసిస్తున్న తీరులో విశ్లేషించారు. 'మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారంటే తమ దేశ భద్రత గురించి ఆలోచిస్తారు. పాకిస్థాన్పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచేందుకు వ్యూహాలు పన్నుతారు. ఆసియాలో పాక్ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తారు' అని చెప్పుకొచ్చారు.
కానీ, అదే సమయంలో 'పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ విదేశాలకు వెళ్లారంటే తన వ్యాపార వ్యవహారాలను చూసుకోడానికే ప్రయత్నిస్తారు. పనామా పత్రాల వ్యవహారాలను బయటకురాకుండా చూసుకోడానికీ, తన అవినీతిని దాచిపెట్టుకోడానికి విదేశీ టూర్లను ఉపయోగించుకుంటారు. జాతి ప్రయోజనాల కోసం పాకిస్థాన్ ప్రధాని ఎవరూ ఎలాంటి చర్యా తీసుకున్నట్లు కనిపించదు. మోడీ భారత జాతి ప్రయోజనాల కోసం ఎంతగా కృషి చేశారంటే ఆసియాలో పాకిస్థాన్కు చైనా తప్ప మరెవ్వరూ దోస్తు మిగలకుండా చేశారు' అని జైద్ విశ్లేషించారు.
మోడీ విదేశాంగ విధానం వల్ల పాక్ ఇప్పటికే ఆసియాలో ఒంటరి అయిందన్నారు. అంతేగాక, 'పాకిస్థాన్కు పాతకాలంనాటి మిత్ర దేశాలన్నింటినీ మోడీ దాదాపు హైజాక్ చేసి తమ వైపునకు తిప్పుకోగలిగారు. మోడీకి సౌదీఅరేబియాలో అనూహ్య స్వాగతం లభించింది. ఆ దేశంతో భారత సంబంధాలు పటిష్ఠమయ్యాయి. ఇరాన్తో కూడా భారత మైత్రి బలపడింది. ఇండియా అఫ్ఘాన్ను పాక్ నుంచి ఇదివరకే దూరం చేసింది' అని చెప్పుకొచ్చారు.
తఇక 'ప్రస్తుతం పాకిస్థాన్కు అమెరికాతో సంబంధాలు చెడిపోగా, ఇరాన్తో ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్ పాకిస్థానీయులను ఉరితీస్తోంది. దీనికంతటికీ కారణం పాకిస్థాన్కు విదేశాంగ మంత్రి, స్పష్టమైన విదేశాంగ విధానం లేకపోవడమే. దేశ భద్రతను కాపాడేందుకు ప్రధాని ఒక చర్య కూడా తీసుకోలేకపోయారు' అంటూ జైద్ హమీద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కరడుగట్టిన భారత ద్వేషి
సయ్యద్ జైద్ జమాన్ హమీద్.. పాకిస్థాన్లో పేరొందిన రాజకీయ విశ్లేషకుడు. పాక్ సైనికుడి కుమారుడు. కరడుగట్టిన భారత ద్వేషి. హిందువులు, యూదులు, పష్తూన్లపై తీవ్ర ద్వేషంతో వ్యాఖ్యలు చేస్తుంటారు. మహ్మద్ ప్రవక్త భారత్పై యుద్ధం ప్రకటించారని.. భారతీయులు ఇస్లాంను అంగీకరించకపోతే వారిని ఓడించి, బానిసలుగా చేసుకోవాలని విశ్వసిస్తారు.
పాక్ను అస్థిరపరచేందుకు భారత, అమెరికా, ఇజ్రాయెల్ల గూఢచార సంస్థలైన రా, సీఐఏ, మొస్సాద్లు కలిసి పనిచేస్తున్నాయని కుట్ర సిద్ధాంతాలు ప్రవచిస్తుంటారు.
అయితే, ఆయన తీరును పాకిస్థాన్ పాత్రికేయులు, రచయితలు, ఇస్లామిక్ పండితులు కూడా విమర్శిస్తుంటారు. 2015 జూన్లో సౌదీకి వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసి జైలుపాలై అక్టోబరులో విడుదలయ్యారు. అది కూడా మన గూఢచార సంస్థ పనేనని ఆరోపించడం కొసమెరుపు. ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ ప్రజలకు భారత్పై ద్వేష భావం కలిగేలా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.