హైదరాబాద్: తాను స్టేడియం అధికారినని, క్రీడల్లో అవకాశం కల్పిసానని 16 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణిపై ఓ ఆగంతకుడు అత్యాచారం జరిపిన ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. 16 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణి ప్రాక్టీస్ చేసేందుకు గాను ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియానికి వచ్చింది.
తాను స్టేడియం నిర్వహణాధికారినని, కబడ్డీలో మంచి అవకాశాలు కల్పిస్తాననని ఆశ పెట్టి అమ్మాయిపై ఓ ఆగంతకుడైన 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. జులై 9వ తేదీన జరిగిన ఈ ఘటన అనంతరం బాధిత అమ్మాయి అనారోగ్యానికి గురైంది. దీంతో బాధిత అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
జులై 9న బాధిత అమ్మాయి తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను స్పృహలో లేనిసమయంలో ఈ అఘాయిత్యం జరిగిందని, ఆ సమయంలో తనకు ఏం జరిగిందో కూడా తెలియదని, ఓ పెద్ద గది మాత్రమే తనకు గుర్తు ఉందని ఉత్తర ఢిల్లీకి చెందిన ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
'35-40 ఏళ్ల మధ్య ఉండే ఓ అథ్లెట్ ఆమెను తన కారులో ఛత్రసాల్ మైదానం నుంచి తీసుకెళ్లాడు. అతడు ఇచ్చిన ఆహారం, పానీయాలు తీసుకున్న ఆమె స్పృహ కోల్పోయింది. జూలై 10న ఆమెను అతడు హెచ్చరించి ఓ బస్టాండ్ వద్ద వదిలేశాడు' అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్పేందుకు మొదట తాను చాలా భయపడ్డానని, కానీ, చివరకు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. నిందితుడు ఎవరనే విషయంపై స్టేడియంలోని హాజరు పట్టికలో నమోదైన వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.