అడిలైడ్: మూడు మ్యాచుల సిరీస్లో బాగంగా జరిగిన తొలి ట్వంటీ20లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. అన్ని విభాగాల్లో భారత మహిళలు ప్రతిభను కనబరిచారు. ఆస్ట్రేలియాపై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాన్ని సఫలం చేసుకుంటూ ఆస్ట్రేలియాను 18.4 ఓవర్లలో 141 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఓడించింది. ఒక సందర్భంలో ఆస్ట్రేలియా 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. బేత్ మూని 36 పరుగులు, ఆలైస్సా హేలీ 41 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఆదుకున్నారు.
దాంతో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకుంది. జె గోస్వామి, శిఖా పాండే, అనుఖా పాటిల్ తలో వికెట్ తీసుకున్నారు.
అస్ట్రేలియా తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం నాలుగు పరుగులు చేసి అవుటైంది. మ్యాచ్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డు దక్కించుకున్న హర్మాన్ప్రీత్ కౌర్ 31 బంతుల్లో అరడజను ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 46 పరుగులు చేసింది. స్మృతి మంథన (29), వేద కృష్ణమూర్తి (36) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ జెస్ జోనసేన్కు రెండు వికెట్లు దక్కాయి. రెండో ట్వంటీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.