ముంబై: క్రీడారంగంలో పద్మ అవార్డుల గొడవ క్రీడా మంత్రిత్వ శాఖకు చుట్టుకునేట్లు ఉంది. పద్మ భూషణ్ అవార్డుకు సిఫార్సు చేసినవాళ్లలో తన పేరు లేకపోవడంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. దాంతో ఆమె పేరును సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, బాక్సర్ విజేందర్ సింగ్ పద్మ అవార్డు కోసం పెదవి విప్పారు. 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న విజేందర్ సింగ్ పద్మ అవార్డులకు సిఫార్సు అయినవారి జాబితాలో తన పేరు కూడా ఉండాలని అంటున్నారు.
ఆయన వ్యక్తిగతంగా క్రీడా మంత్రిత్వ శఆఖ అధికారులతో మాట్లాడలేదు. కానీ మీడియాకు ఓ ప్రకటన మాత్రం ఇచ్చాడు. తాను వెళ్లి అవార్డును అడగబోనని, క్రీడా మంత్రిత్వ శాఖ పద్మ అవార్డుకు సరైన వ్యక్తిని సిఫార్సు చేసే విషయంలో తెలివిగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
విజేందర్ సింగ్ 2010లో పద్మశ్రీ అవార్డు పొందాడు. ఆ తర్వాత కూడా ప్రతిభను కనబరుస్తూ 2014 కామన్ వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించాడు. సైనాకు పద్మ భూషన్ అవార్డు పొందే అర్హత ఉంది గానీ ఆమె కన్నా తానేమీ తక్కువ కాదని విజేందర్ సింగ్ మీడియాతో అన్నారు.
రెండు సార్లు ఒలింపిక్ పతకం గెలిచిన సుశీల్ కుమార్కు తొలుత క్రీడామంత్రిత్వ శాఖ సిఫార్సు చేసిన మేరకు ఆ అవార్డు దక్కాలని ఆయన అన్నారు. సైనా నెహ్వాల్ను కూడా సిఫార్సు చేస్తే క్రీడా మంత్రిత్వ శాఖ తన పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
తన పేరును పద్మ భూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేసేలా చూడాలని విజేందర్ సింగ్ బాక్సింగ్ ఇండియా ఫెడరేషన్ను కోరారు. అసోసియేషన్ను తాను అడిగానని, నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని, ఏమవుతుందో చూద్దామని ఆయన అన్నారు.