మెల్బోర్న్: దక్షిణాఫ్రికాతో తలపడే సమయంలో స్టెయిన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సచిన్ టెండూల్కర్ సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు భారత్ను హెచ్చరిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా రేపు (ఆదివారం) భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనున్న విషయం తెలిసిందే. డాలే స్టెయిన్తో తనకు గొప్ప స్నేహం ఉందని అతను అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీ్గ (ఐపియల్) రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో మూడేళ్ల పాటు కలిసి ఆడిన తర్వాత స్టెయిన్ తాను మంచి మిత్రులమయ్యామని విరాట్ కోహ్లీ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నాడు. రేపు అతను ఆడడానికి మైదానంలోకి దిగినప్పుడు ప్రత్యర్థి బౌలరుగానే భావించి ఆధిపత్యం సాధించడానికి చూస్తానని అతను అన్నాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో మూడేళ్ల పాటు కలిసి ఆడామని, తాము మంచి మిత్రులమయ్యామని, ఆ తర్వాత కూడా స్నేహాన్ని కొనసాగించామని, తాను కలిసినప్పుడు స్టెయిన్ తనను అత్యంత ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడని, అది నిలకడగా ఉందని కోహ్లీ వివరించాడు.
స్టెయిన్ దూకుడుగా ఉంటాడని, దక్షిణాఫ్రికా తరఫున ఆడడం ఆయనకు విపరీతమైన ఆసక్తి అని, అతను ఎల్లవేళలా మంచి బౌలర్గా రాణించడానికి కారణాలున్నాయని, ఆయనకు ఆ మానసిక స్థితి ఉందని, ఫీల్డ్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాడని, జోక్లు వేస్తూ ఉంటాడని, ఎల్లవేళలా నవ్వుతూ ఉంటాడని, అతన్ని దగ్గరగా చూస్తే అతనేమిటో తెలియదని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు.
రేపటి మ్యాచ్ స్టెయిన్కు, విరాట్ కోహ్లీకి మధ్యనే జరుగుతుందని భావిస్తున్నారు. అది ఇరువురికి మధ్య పోటీగా మారింది. ఆట ప్రారంభమైతే ఇద్దరి మధ్య పోరు హోరాహోరీ సాగుతుందనడంలో సందేహం లేదు.