మెల్బోర్న్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికా - భారత్ మధ్య మెల్ బోర్న్లో ఆదివారం జరిగిన మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన విషయం తెలిసిందే. మెల్బోర్న్ స్టేడియం సామర్థ్యం దాదాపు 90వేలు. అందులో ఎనభై శాతం మంది వరకు భారత అభిమానులే ఉన్నారు. దీనిపై సచిన్ ట్విట్టర్లో స్పందించారు.
క్రికెట్ స్టేడియంకు వెళ్లడం తనకు ఎప్పుడు కూడా ప్రత్యేకమే అన్నాడు. మెల్బోర్న్ స్టేడియంలో వాతావరణం అద్భుతంగా ఉందన్నాడు. అంతేకాదు, సచిన్ అభిమానులతో కలిసి ఆ క్రౌడ్లో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశాడు.
ఈ మ్యాచ్ సందర్భంగా సచిన్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ వీక్షణకు వచ్చిన సచిన్కు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. స్టేడియంలో ఉంచిన పెద్ద స్ర్కీన్పై సచిన్ కనిపించగానే 'సచిన్.. సచిన్' అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.
టెండూల్కర్ కూడా అభిమానులకు చేతులు ఊపుతూ కనిపించాడు. ఫ్యాన్స్ స్పందన చూస్తే సచిన్ ఇంకా రిటైర్కాలేదనే అనిపించింది. ఐసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక అతిథుల బాక్స్లో ఉన్న వారంతా సచిన్ను చూపి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు
దారాళంగా పరుగులు ఇచ్చిన పార్నెల్
దక్షిణాఫ్రికా పేసర్ వేన్ పార్నెల్ భారత్తో మ్యాచ్ సందర్భంగా దారాళంగా పరుగులు ఇచ్చాడు. 9 ఓవర్లలో అతను ఏకంగా 85 పరుగులిచ్చి పరోక్షంగా సాయం చేశాడు. ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా తరఫున ఇదే అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన. 2007లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో షాన్ పోలాక్ 83 పరుగులు ఇచ్చాడు.
ఒక టెస్టు హోదాగల జట్టులోని ఒక బౌలర్ నుంచి భారత్ అత్యధికంగా పరుగులు రాబట్టిన సందర్భాల్లో ఇది రెండోది. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 2011 వరల్డ్ కప్లో 91 పరుగులు భారత్కు సమర్పించుకున్నాడు.
రనౌట్ చేయిస్తే సెంచరీ!
పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ పిలుపుకు స్పందించి పరుగు కోసం ముందుకెళ్లి ధావన్ రనౌట్ అయ్యాడు. అప్పుడు కోహ్లీ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సమయంలో ధావన్ పిలుపుతో రోహిత్ పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈసారి ధావన్ సెంచరీ కొట్టాడు.
దక్షిణాఫ్రికా జట్టుకు జరిమానా
ప్రపంచకప్లో భాగంగా భారత జట్టు చేతిలో పరాజయం పాలైన దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ. ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసినందుకు సఫారీలకు జరిమానా విధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు నిర్ణీత సమయానికి ఓ ఓవర్ తక్కువ వేశారు.
దీంతో సారథి డివిల్లీర్స్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు ఫీజులో 10 శాతం చొప్పున జరిమానా వేశారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లోపు దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేస్తే డివిల్లీర్స్ ఓ మ్యాచ్ ఆడకుండా సస్పెండ్కు గురయ్యే ప్రమాదముంది.
పటాకా పేలుతోంది!
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్కు ముందు వచ్చిన స్టార్ స్పోర్ట్స్ ప్రచార ప్రకటనకు కొనసాగింపుగా వస్తున్న ప్రకటనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చరిత్రను తిరగరాస్తూ దక్షిణాఫ్రికాపై బారత్ మ్యాచ్ గెలవగానే టీవీల్లో ఓ కొత్త ప్రకటన కనిపించింది.
ప్రపంచకప్లో భారత్ పైన పాకిస్తాన్ విజయాన్ని కాంక్షిస్తూ 1992 నుండి బాణసంచా ముందు పెట్టుకొని కూర్చొని.. తమ జట్టు ఓడిన ప్రతిసారి వాటిని అటకెక్కిస్తుంటాడు పాక్ అభిమాని. అతను దక్షిణాఫ్రికా జెర్సీ వేసుకొని ఆ జట్టు అభిమానులతో కలిసి భారత్ మ్యాచ్ చూస్తాడు.
ప్రపంచకప్లో భారత్ చేతిలో ఎప్పుడూ ఓడని సఫారీ జట్టు కూడా పరాజయం పాలు కావడంతో అతను నిరాశతో దక్షిణాఫ్రికా జెర్సీని అక్కడే విడిచి బయటకు వెళ్తుంటాడు. ఇంతలో యూఏఈ జట్టు అభిమాని.. అతడికి జెర్సీ ఇస్తాడు. భారత్ తర్వాత తలపడేది యూఏఈతో. భారత్ వర్సెస్ ప్రపంచ జట్లు అన్న నేపథ్యంలో సాగుతున్న ఈ ప్రకటనపై ఇంటర్నెట్లో చాలా రెస్పాన్స్ వస్తోంది.