కొలంబో: నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా రికార్డు స్థాయి ప్రదర్శన కనబర్చాడు. భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శనతో శ్రీలంక పర్యటనలో మూడు టెస్టుల్లో 15 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు.
మూడో టెస్టులో 117 పరుగుల తేడాతో గెలిచిన భారత్ 2-1తో మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది. 15 వికెట్లు పడగొట్టిన మిశ్రా.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
32ఏళ్ల మిశ్రా శ్రీలంక పర్యటనకు రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్లతోపాటు మూడో స్పిన్నర్గా వెళ్లాడు. 2011, ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటన తర్వాత మళ్లీ నాలుగేళ్లకు మిశ్రా భారత జట్టులో చేరాడు.
సెలెక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతీ మ్యాచులో కీలక వికెట్లు పడగొట్టి భారత్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు మిశ్రా. అశ్విన్ 17 వికెట్లు తీయగా, మిశ్రా 15 వికెట్లు (4/43)పడగొట్టాడు. అంతేగాక, 157 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం కూడా ఉంది. భారత్ తరపున మూడు టెస్టుల్లో ఈ స్థాయిలో రాణించిన ఉత్తమ స్పిన్నర్గా మిశ్రా రికార్డు సృష్టించాడు.
భారత విజయంలో కీలక పాత్ర పోషించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని సిరీస్ అనంతరం మిశ్రా తెలిపాడు. కెప్టెన్ కోహ్లీ సానుకూల దృక్పథాన్ని సూచించేవాడని చెప్పాడు. కాగా, క్రికెట్ విశ్లేషకుడు మోహందాస్ మీనన్ మిశ్రా ప్రదర్శన పట్ల ట్విట్టర్లో అభినందనలు తెలిపాడు.
Amit Mishra (157 runs and 15 wickets) is the first Indian to score 150+ runs and claim 15 wkts in a 3 match Test series
#IndvSL
— Mohandas Menon (@mohanstatsman) September 1, 2015