ముంబై: గత రెండున్నరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మధ్య దూరం పెరిగినట్లే కనిపిస్తోంది. సామాజిక మాధ్యమంలో ఒకరినొకరు అనుసరించడం మానేసిన నేపథ్యంలో వీళ్లిద్దరి బంధానికి తెరపడ్డట్లు ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.
కోహ్లి, అనుష్కల మధ్య విభేదాలు రావడానికి కారణం విషయానికొస్తే.. పెళ్లి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమేనట. ఈ ఏడాదే పెళ్లి చేసుకుందామని కోహ్లి అంటుండగా.. అనుష్క మాత్రం వచ్చే ఏడాది వరకు ఆగమంటోందట.
ప్రస్తుతం బాలీవుడ్లో తాను రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నానని.. కాబట్టి వచ్చే ఏడాది వరకు ఆగుదామని అనుష్క అనడంతో కోహ్లికి కోపం వచ్చి ఆమెను అనుసరించడం మానేశాడట. దీంతో అనుష్క కూడా అంతే ఆగ్రహంగా అతణ్ని అనుసరించడం మానేసిందట.
కాగా, ఈ ఏడాదే పెళ్లి చేసుకుందామనే ఉద్దేశం విరాట్ కోహ్లీ పంజాబీ సాంప్రదాయం ప్రకారం కొంచెం గడ్డం కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అనుష్క సమాధానంతో ఆ గడ్డాన్ని కాస్తా తొలగించేశాడు.
అంతేగాక, ఇటీవల విరాట్ కోహ్లీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోలు కూడా అనుష్క శర్మ కనిపించకపోవడం గమనార్హం. సిడ్నీలో హర్భజన్ సింగ్, అతని భార్య గీతా బస్రా, ఆశీష్ నెహ్రాలతో కలిసి కోహ్లీ విందులో పాల్గొన్నాడు.
ఒకరి కోసం ఒకరన్నట్లుగా తిరిగిన ఈ ప్రేమపక్షులు ఒక్కసారిగా దూరం కావడంతో అభిమానులు కూడా బాధపడుతున్నారు. మరి వీళ్లిద్దరూ మెట్టు దిగి తమ బంధాన్ని కొనసాగిస్తారా.. లేక పట్టుదలకు పోయి నిజంగానే విడిపోతారా? అనేది వేచి చూడాల్సిందే.