హైదరాబాద్: 'అర్జున అవార్డుల గౌరవాన్ని కాపాడాలి. అసలు ప్రతీ ఏటా అర్జున ఇవ్వాల్సిన అవసరం ఏముంది?' అని మాజీ అవార్డు గ్రహీతలు అంటున్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ కుమారుడు, హాకీ జట్టు మాజీ కెప్టెన్ అశోక్ కుమార్, లెజెండరీ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ శ్రీరామ్ సింగ్, వాలీబాల్ కెప్టెన్ సురేశ్ మిశ్రాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
పురస్కారాల ఎంపిక విధానం, ప్రదానాన్ని కూడా వీరు తప్పబట్టారు. 'అవార్డుల గౌరవాన్ని కాపాడాలి. అసలు ప్రతీ సంవత్సరం అర్జున ఇవ్వాల్సిన అవసరం ఏముంది?' అని అశోక్ కుమార్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టాలని... ఆసియాడ్, ఒలింపిక్ పతక విజేతలకే ప్రదానం చేయాలన్న నిబంధన ఉండాలని సూచించారు.
అవార్డుల విలువను పెంచాలని ఆయన అన్నారు. ఇక, తమకు పురస్కారాలు ఇవ్వాలని ఆటగాళ్లే స్వయంగా దరఖాస్తు చేసుకునే ప్రస్తుత విధానాన్ని కూడా ఆయన తప్పుపట్టాడు. క్రీడాకారులు ఏదైనా సాధిస్తే ప్రభుత్వమే గుర్తించి అర్జున, ఖేల్రత్న అందిస్తే బాగుంటుందని అన్నారు. భారత స్క్వాష్ మాజీ ఆటగాడు సౌరవ్ ఘోషల్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
'నాకైతే అవార్డులకు ఫలానా వ్యక్తిని సిఫారసు లేదా నామినేట్ చేసే ప్రక్రియలోనే లోపం ఉందనిపిస్తోంది. అసలు ప్లేయర్ను సిఫారసు చేయడం, అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్న మాటే బాగోలేదు. పురస్కారాల కమిటీనే ప్రతిభ ఆధారంగా విజేతలను ప్రకటించాలి. అవార్డుకు దరఖాస్తు చేయడం అంటే తమకు ప్రయోజనం కల్పించాలని కోరినట్టే' అని అన్నారు.
1972లో తాను ఆసియా పతకం సాధించినా అర్జున ఇవ్వలేదని సీనియరైన బీఎస్ చౌహాన్కు ఇచ్చారని షెకావత్ అన్నారు. అర్జున అవార్డు పొందాలంటే కనీస అర్హతగా ఆసియా గేమ్స్ను చూపించాలని ఆయన సూచించారు. 'ఏ పేరు గొప్ప అర్జున లేదా రాజీవ్గాంధీ' అని సురేశ్ మిశ్రా ప్రశ్నించారు. రాజీవ్ ఖేల్రత్నను గొప్పగా చూడడం అర్జున అవార్డును అవమానించడమేనని అన్నారు.