కోల్కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)8వ ఎడిషన్ పైనల్లో చెన్నై ఓటమికి కారణం టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకోవడమేనా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఐపీఎల్లో అంతక ముందు జరిగిన ఫస్ట్ క్వాలిఫయిర్ మ్యాచ్లో కూడా ధోని ఇదే తప్పిదాన్ని చేశాడని అంటున్నారు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అంటే ఆషామాషీ కాదు. ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. అలాంటి మ్యాచ్లో టాస్ ఎంతో కీలకం. టాస్ గెలిచిన ధోని తొలుత బ్యాటింగ్ ఎంచుకోకుండా ఫీల్డింగ్ ఎంచుకోవడమే చేసిన తప్పు. ఐపీఎల్లో జరిగిన 8 ఎడిషన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 సార్లు ఫైనల్స్కు చేరింది. ఆరు ఐపీఎల్ పైనల్స్లో ధోని టాస్ గెలవడం ఇది నాల్గవసారి. గత మూడు సీజన్లలో చెన్నై కెప్టన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ని ఎంచుకున్నాడు.
బ్యాటింగ్ని ఎంచుకున్న మూడు ఫైనల్ మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు సార్లు గెలిస్తే ఒకసారి ఓటమిని చవిచూసింది. క్వాలిఫయిర్ 1లో అదే ముంబై జట్టుపై 25 పరుగుల తేడాతో ఓటమి పాలైన చెన్నై జట్టు, ఫైనల్లో టాస్ గెలిచినా ఫీల్డింగ్ని ఎంచుకుంది.
మ్యాచ్ అనంతరం చెన్నై జట్టు కెప్టెన్ ధోని మాట్లాడుతూ తమ జట్టు పూర్తిస్థాయిలో రాణించక పోవడం వల్లనే ఓటమికి కారణమని అన్నాడు. మొహిత్ శర్మ వేసిన రెండో ఓవరే తమ కొంప ముంచిందని చెప్పాడు. ముంబై జట్టు పుంజుకోవడానికి, మ్యాచ్ తమ చేయి జారడానికి ఈ ఓవరే కారణమన్నాడు.
ఈ ఓవర్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 2 ఫోర్లు, 1 సిక్సర్తో 16 పరుగులు సాధించాడు. ఇక భారీ స్కోరును ఛేదించే క్రమంలో బరిలోగి దిగిన తమ ఓపెనర్లు సరైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారని అన్నాడు. ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ లేకపోడవం కూడా తమ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు.
ప్లేఆఫ్స్లో ఆడిన మ్యాచ్ల్లో జట్టు సమిష్టిగా ఆడకపోవడం వల్లనే టైటిల్ చేజారిందన్నాడు. టోర్నమెంట్ మొత్తంగా చూస్తే జట్టు ప్రదర్శన సంతృప్తికరంగానే ఉందని ధోని తెలిపాడు.