న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) గుర్తింపు గల జాతీయ క్రీడా సమాఖ్య కాదని క్రీడాశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ పార్లమెంటుకు తెలిపారు. లోక్సభలో భాజపా సభ్యుడు రావుసాహెబ్ పాటిల్ దన్వే అడిగిన ప్రశ్నకు సోనోవాల్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
'బిసిసిఐని క్రీడామంత్రిత్వ శాఖ అధికారికంగా గుర్తించలేదు. కానీ ఐసిసి.. భారత్లో క్రికెట్ను వ్యాప్తి చేసే సంస్థగా దాన్ని గుర్తించింది. భారత్లో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేందుకు, అంతర్జాతీయ ఈవెంట్లలో జాతీయ జట్టు పాల్గొనేందుకు క్రీడా శాఖ కేవలం అనుమతులిస్తుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చూ కాదు. హోం మంత్రిత్వ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖలు అనుమతులు మంజూరు చేస్తాయి' అని సోనోవాల్ వివరించారు.
బిసిసిఐకి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం చేయదని కూడా సోనోవాల్ తెలిపారు. కాగా, బిసిసిఐ గతంలో సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చేందుకు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రభుత్వం బిసిసిఐని అధికారిక సమాఖ్యగా గుర్తించకున్నా.. ఇప్పటివరకు 47 మంది క్రికెటర్లు జాతీయ క్రీడా అవార్డులు అందుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డును కూడా అందుకున్నారు.