న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ ఉగ్రవాద దాడి ఘటన భారత్, పాకిస్ధాన్ క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో భారత్, పాక్ల మధ్య క్రికెట్ సిరిస్ నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
'గతంలో కూడా సిరిస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రికెట్ సిరిస్పై పీసీబీ ప్రతిపాదించినా, ఎక్కడ నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. అయితే భారత్పై మళ్లీ దాడులు జరుగుతున్నాయి. గతంలో జమ్మూ, ఇప్పుడు పంజాబ్లోనూ ఉగ్రవాద దాడులు జరిగాయి. భారతీయలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రాణాలు ఎంతో విలువైనవి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడితే తప్ప క్రికెట్ సిరిస్ ఉండదు ' అని ఓ టీవి ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
1993 ముంబై వరుస పేలుళ్ల అనంతరం భారత్, పాక్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టోర్నమెంట్ల్లో తప్ప ద్వైపాక్షిక సిరిస్లు మాత్రం జరగలేదు. అయితే ఇటీవల భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు పీసీబీ బోర్డ్ ఛైర్మన్ భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల బోర్డులు తటస్ధ వేదికపై సిరిస్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. దుబాయ్ వేదికగా భారత్, పాక్ క్రికెట్ సిరిస్ను ఈ ఏడాది చివరలో నిర్వహించాలని యోచించాయి. అయితే సోమవారం జరిగిన ఉగ్రదాడితో భారత్, పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కష్టమని బీసీసీఐ సెక్రటరీ ఠాకూర్ చెప్పారు.