ముంబై: ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది. ఆయన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇటు క్రికెట్లో, అటు కుటుంబపరంగా ప్రతిష్ట మసకబారుతోంది. తాజాగా, శ్రీనివాసన్ బీసీసీఐ బోర్డ్ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మరో ప్రకటన చేశారు.
శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా భారత క్రికెట్ వ్యవహారాల్లో ఏవైనా అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాధారాలుంటే అతణ్ని వెంటనే ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పిస్తామని చెప్పారు. అవసరమైతే ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించవచ్చునని, తమకేమీ తొందర లేదన్నారు.
ఐతే ఎవరికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నా చర్యలు తీసుకుంటామని, శ్రీనివాసన్ సెప్టెంబరు వరకు బీసీసీఐ ప్రతినిధిగా ఐసీసీలో ఉంటాడని, అయితే, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలుంటే ఐసీసీలో కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయిస్తామన్నాడు.
కాగా, కొద్ది రోజుల క్రితం బరోడా క్రికెట్ నుండి శ్రీనివాసన్ ఎయిడ్ను తొలగించారు. తాజాగా, నిన్న శ్రీనివాసన్ కుమారుడు తండ్రిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అమ్మాయిని పెళ్లాడి తన వంశాభివృద్ధికి పిల్లల్ని కనివ్వాలంటూ ఐసీసీ ఛైర్మన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తనను బలవంతం చేస్తున్నాడంటూ అతడి కొడుకు అశ్విన్ ఆరోపించాడు. స్వలింగ సంపర్కుడైన అశ్విన్ తనపై తండ్రి వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయని ఓ పత్రికకు వెల్లడించాడు. ఇది సంచలనం కలిగించింది.