న్యూఢిల్లీ: బుకీతో బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ కలిసి పార్టీ చేసుకున్నాడని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్పై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐకి ఒక లేఖ రాసింది.
ఈ లెటర్ను బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియాకు రాసింది. బీసీసీఐలో అధ్యక్షుడి తర్వాత కార్యదర్శి పదవే అత్యున్నతమైనది. క్రికెట్లో తీసుకునే కీలక నిర్ణయాల్లో ఈ పదవిలోని వ్యక్తికి సముచిత స్ధానం ఉంది. అలాంటి పదవిలో ఉన్న అనురాగ్ ఠాకూర్, ఐసీసీ యాంటీ కరప్షన్, సెక్యూరిటీ జాబితాలో ఉన్న క్రికెట్ బుకీ కరణ్ గిల్హోత్రాతో కలిసి పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ ఇంగ్లీషు టీవీ ఛానెల్లో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ప్రసారం చేయగా, సమాచారం అందుకున్న ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్ సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అనురాగ్ ఠాకూర్పై చర్యలు తీసుకోవాలని ఆ లెటర్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అయితే బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియా ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదంట. ఐసీసీ మెయిల్ పంపి ఇప్పటికే నాలుగు రోజులు గడిచినా ఈ విషయంపై ఎవరూ నోరు మెదప లేదని తెలుస్తోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశం అజెండాలో ఈ అంశం గురించే ప్రస్తావనకు రాలేదంట.
ఇక బీసీసీఐ సభ్యులపై మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ నెరపిన గూఢచర్యం విషయంపై దర్యాప్తు వేయనున్న కమిటీకి అనురాగ్ ఠాకూర్ నేతృత్వం వహించనున్నారు. ఇక అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం బీజీపీ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.