ముంబై: జర్నలిస్ట్ పైన మండిపడిన విరాట్ కోహ్లీకి బీసీసీఐ క్లాస్ పీకింది. భారత జట్టు యొక్క డిగ్నిటీని దెబ్బతీయవద్దని హెచ్చరించింది. రెండు రోజుల క్రితం విరాట్ కోహ్లీ ఓ జర్నలిస్ట్ పైన మండిపడడం, ఆ తర్వాత క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ స్పందించింది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాలని టీమ్ మేనేజ్మెంట్కు బీసీసీఐ సూచించింది.
భారత జట్టులోని ఆ ఆటగాడు (విరాట్ కోహ్లీ) జట్టు డిగ్నిటీకి నష్టం రాకుండా చూడాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవద్దని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఓ నోట్ను మీడియాకు విడుదల చేశారు.
క్రికెట్ ఆటకు మీడియా పాత్రను బీసీసీఐ గౌరవిస్తోందని చెప్పారు. క్రికెట్కు మీడియా ఇస్తున్న ప్రాధాన్యత పట్ల అనురాగ్ ఠాకూర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాను తాము గుర్తించామని చెప్పారు.
బీసీసీఐ తన స్టేట్మెంట్లో...
రెండు రోజుల క్రితం పెర్త్లో జరిగిన సంఘటన పైన బీసీసీఐ సీరియస్గా తీసుకున్నది. భారత్ టీమ్ మేనేజ్మెంట్తో బీసీసీఐ సంప్రదిస్తోంది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగవద్దని సూచించాం.
క్రికెట్ ఆటను కవర్ చేయడంలో, పాపులర్ చేయడంలో మీడియా పాత్రను బీసీసీఐ గౌరవిస్తోంది. మీడియా సహకారాన్ని మేం గుర్తించాం. భారత్లో క్రికెట్ ప్రమోషన్లో ఎంతో పాత్ర ఉంది.
భారత క్రికెట్ జట్టు యొక్క డిగ్నిటీని ఆటగాళ్లు కాపాడాలి. అలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలి. దీనిని పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఐసీసీ ప్రపంచకప్ 2015 నేపథ్యంలో భారత క్రికెట్ టీంకు సహకారం, ప్రచారం పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది.
కోహ్లీకి గవాస్కర్, లక్ష్మణ్, లారాల హితవు
విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్లు గవాస్కర్, లక్ష్మణ్, లారాలు హితవు పలికారు. ఈ విషయానికి ముగింపు పలికేందుకు కోహ్లీ క్షమాపణలు చెప్పడమే సరైనదని వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. తాను ఓ సందర్భంలో తప్ప ఎప్పుడు కూడా కోపం వ్యక్తం చేయలేదన్నాడు. ఆ విషయం అందరికీ తెలుసునని చెప్పాడు. అయితే, అది డ్రెస్సింగ్ రూంలో నాలుగు గోడల మధ్యనే అని చెప్పాడు.
మీడియాతో సంబంధాలు చాలా క్లిష్టమైనదని లారా అన్నాడు. అయితే, రెండు పార్టీలు (కోహ్లీ, మీడియా).. దానిని పక్కన పెట్టి ప్రపంచ కప్ పైన దృష్టి సారించాలని కోరాడు. అయితే, ఈ సంఘటన కోహ్లీని ప్రభావితం చేయవచ్చునన్నాడు.