హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్పై అభిమానులు పెద్దగా అంచనాలు పెట్టుకోకపోవడం ఆమెకు ఎంతో మేలు చేస్తుందని కోచ్ విమల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన పలు అంతర్జాతీయ ఈవెంట్స్లో సైనా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
దీంతో అభిమానులు ఆమెపై అంచనాలు పెట్టుకోవడం లేదనే చెప్పవచ్చు. మరోవైపు గాయాలు కారణంగా సైనా వరుస పరాజయాలను చవిచూస్తున్నారు. మరోవైపు పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్లాంటి వారు చక్కటి విజయాలతో దూసుకెళుతున్నారు.
దీంతో వచ్చే వారంలో గ్లాస్కో వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. 2015లో ఇదే టోర్నీలో రజతం సాధించిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ కోచ్ విమల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
'మోకాలి గాయం తర్వాత సైనా ఇబ్బంది పడుతోంది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్లను కూడా కోల్పోయింది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించే సత్తా ఉంది. ఇప్పటికైతే అందరి ఫోకస్ సైనాపై లేదు. సింధు, శ్రీకాంత్లపై అంచనాలున్నాయి' అని అన్నారు.
'నిజానికి ఇదే తనకు మేలు చేస్తుంది. గాయం కూడా ఇబ్బంది పెట్టడం లేదు. డ్రా మాత్రం కఠినంగానే ఉంది. తొలి రౌండ్లో నెగ్గితే ప్రపంచ నంబర్ 2 సంగ్ జీతో సైనా తలపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆమెపై సైనా నెగ్గింది' అని విమల్ కుమార్ అన్నారు.
ఆగస్టు 21 నుంచి జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్లో ఈ ఏడాది రెండు సూపర్ సిరిస్ టైటిళ్లతో రాణించిన కిదాంబి శ్రీకాంత్పైనే అందరి కళ్లు ఉన్నాయి. మరోవైపు సాయి ప్రణీత్, పీవీ సింధులు కూడా ఈ టోర్నీలో ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నారు.