న్యూఢిల్లీ: జాతీయ కబడ్డీ ఆటగాడు, ప్రో కబడ్డీ లీగ్లో బెంగుళూరు బుల్స్ తరుపున ఆడిన రోహిత్ కుమార్ భార్య లలిత ఆత్మహత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒంటరిగా ఉండటంతో పాటు భర్తతో విభేదాల కారణంగా ఆమె మంగళవారం ఢిల్లీలోని తండ్రి నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ నేపథ్యంలో బుధవారం ఆమె తండ్రి నివాసంలో సూసైడ్ నోట్తో పాటు రెండు గంటల పాటు రికార్డు చేసిన ఆడియో మెసేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లలిత సూసైట్ నోట్ ఎంతో కీలకంగా మారింది. సూసైడ్ నోట్లో లలిత 'ఇంకా ఇలా బతికేంత శక్తి నాకు లేదు. చనిపోవాలని నిర్ణయించుకున్నా' అని రాసినట్లుగా సీనియర్ పోలీసు అధికారి విజయ్ కుమార్ తెలిపారు.
రోహిత్ వేరొక మహిళతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడని ఆమె అందులో పేర్కొన్నారు. ఇక ఆడియో మేసేజ్లో తన భర్త, అతడి కుటుంబసభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని, తనను తీవ్రంగా అవమానపరిచారని, ఇంటి నుంచి గెంటివేసినట్లు ఆమె రాశారు. సూసైడ్ నోట్ ఆధారంగా రోహిత్తో పాటు, అతని తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
లలిత ఆత్మహత్య ఘటన జరిగినప్పుడు రోహిత్ అహ్మదాబాద్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆరు నెలల క్రితమే వీరి వివాహం జరిగింది. విశేషమేమిటంటే వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. కాగా లలితకు ఇది రెండో పెళ్లి అని పోలీసులు వెల్లడించారు.
నేషనల్ కబడ్డీ ప్లేయర్ రోహిత్ భార్య ఉరేసుకుని ఆత్మహత్య
లలిత ఆడియో రికార్డ్లో రోహిత్, ఆయన కుటుంబసభ్యులు మానసికంగా, శారీరకంగా చాలా విషయాల్లో వేధించారని, ఉద్దేశపూర్వకంగా ఢిల్లీకి రాకుండా తనను ఒంటరిగా ఉంచుతున్నారని పోలీసులు తెలిపారు. గతవారం తన భర్త రోహిత్ను చూసేందుకు వెళ్లగా జరిగిన పరిణామాలతో ఆమె తీవ్ర అసంతప్తికి లోనైంది.
రోహిత్ తాను సంతోషంగా ఉండాలంటే ఒంటరిగా వదిలేయమని కోరాడని లలిత వీడియోలో పేర్కొందని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన లలిత ఈ నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. లలిత కుటుంబ సభ్యులు సైతం ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధుల ముందు ప్రస్తావించారు.
లలిత చాలా డిప్రెషన్కు గురైందని, మొదటి పెళ్లిలో కూడా ఆమె వరకట్న వేధింపులు ఎదుర్కొందని ఆమె తరుపు బంధువులు తెలిపారు. రోహిత్తో పాటు అతని కుటుంబ సభ్యులు తన కుమార్తెని చాలా సార్లు వేధింపులకు గురి చేసినట్లు తనతో చెప్పిందని, కానీ కుటుంబం పరువు కోసం పోలీసులకు వెళ్లొద్దని తనతో చెప్పిందని లలిత తండ్రి కరన్ సింగ్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 24న తన కుమార్తెను వేధింపులకు గురి చెయ్యడంతో తన వద్దకు వచ్చినట్లు ఆయన తెలిపారు. సోమవారం తాను బయటకు వెళ్లిన తరుణంలో ఆమె తన గదిలోని సీలింగ్ ఫ్యాన్కు దుప్పట్టాతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కబడ్డీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా రోహిత్ అహ్మదాబాద్లో ఉన్నాడని అతడితో పాటు కుటుంబ సభ్యులను విచారించాల్సి ఉందని కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెల్లడించారు. రోహిత్ తల్లిదండ్రులు మాత్రం కనిపించకుండా పోయినట్లు తెలిపారు.