న్యూఢిల్లీ: కోర్టులో న్యాయ పోరాటాన్ని గెలిచి, బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ నుంచి అర్జున అవార్డును స్వీకరించిన బాక్సర్ మనోజ్ కుమార్ ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు అవార్డుల కమిటీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్పై విమర్శలు కురిపించాడు.
అర్జున అవార్డుకు అన్నివిధాలా అర్హుడినైనా, తప్పుడు సమాచారంతో కపిల్ దేవ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తనను పక్కనబెట్టి మరో బాక్సర్ను ఎంపికచేసిందని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు కోర్టులో పోరాడి ఇప్పుడు అర్జున అవార్డును అందుకుంటున్నానని మనోజ్ అన్నాడు.
తాను కామన్వెల్త్లో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నానని కపిల్కు గర్వంగా సమాధానం చెప్తానని పిటిఐతో మాట్లాడుతూ.. వ్యాఖ్యానించాడు. 'అప్పుడు నీవెవరు అని ప్రశ్నించావ్..ఈరోజు మళ్లీ చెబుతున్నా.. నేను మనోజ్ను. ఇదిగో.. అర్జున అవార్డు గ్రహీతను' అని కపిల్ను ఉద్దేశిస్తూ మనోజ్ ఘాటుగా బదులిచ్చాడు.
'నాకు అన్యాయం జరిగిందని గోడువెల్లబోసుకుంటే అప్పుడెవరూ పట్టించుకోలేదు. అప్పట్లో ఇదే విషయమై కపిల్కు ఫోన్చేస్తే.. నీవెవరు అని ప్రశ్నించాడు. నేను బాక్సర్ మనోజ్ను, 2010 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచాను. అర్జున జాబితా నుంచి నా పేరును తొలిగించారు. కాంస్య పతక విజేతను అవార్డుకు ఎంపికచేశారు . ఈ విషయాలన్నీ నేను మాట్లాడనంటూ కపిల్ ఫోన్ కట్చేశాడు' అని నాటి ఉదంతాన్ని మనోజ్ గుర్తుచేసుకున్నాడు.
మనోజ్ పేరుతో ఉన్న మరో బాక్సర్ డోపీగా తేలితే.. మనోజే అనుకొని అతని పేరును అర్జున జాబితా నుంచి కపిల్ బృందం తొలగించింది. దీంతో మనోజ్ కోర్టులో పోరాడి చివరకు అవార్డును దక్కించుకున్నాడు. ఇప్పుడు అర్జున అవార్డును తీసుకున్నానని, తన గురించి కపిల్కు గర్వంగా చెప్పగలుగుతానని మనోజ్ వ్యాఖ్యానించాడు.
ఇది ఇలా ఉండగా, 1964 ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టిన హాకీ జట్టులోని ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులను సోనోవాల్ సత్కరించారు. అదే విధంగా ఈ ఏడాది జరిగిన ఆసియా పారా గేమ్స్లో పతకాలను సాధించిన క్రీడాకారులను కూడా ఆయన సన్మానించారు.