ప్రభుత్వం అనుమతి కోరిన రామచంద్రన్
2032 ఒలింపిక్స్తోపాటు 2030 ఏషియన్ గేమ్స్ నిర్వహణకు బిడ్స్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రన్ జూన్ నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. రామచంద్రన్ చేసిన ప్రతిపాదనపై క్రీడా మంత్రిత్వ శాఖ ఓ అధ్యయనాన్ని చేపట్టింది.
నిర్వహణకు భారీ మొత్తంలో ఖర్చు
క్రీడల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఒలింపిక్స్ నిర్వహణకు భారీ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉండటం, ఈ మెగా ఈవెంట్ని నిర్వహించిన దేశానికి కూడా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో దీనిపై ఆచితూచి వ్యవహరించాలని క్రీడాశాఖ నిర్ణయించింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్, బ్రెజిల్
ఇప్పటికే ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించి గ్రీస్, బ్రెజిల్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. 2032 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చే దేశాన్ని 2025లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రకటిస్తుంది. ఇందుకు బిడ్డింగ్ ప్రక్రియ తొమ్మిదేళ్ల ముందుగానే ప్రారంభమవుతుంది.
ఒలింపిక్స్ నిర్వహణకు వెనుకడుగు
ఇలా చేయడం ద్వారా బిడ్డింగ్లో గెలిచిన దేశాలు సన్నద్ధమవడానికి మరింత సమయం లభిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం గేమ్స్ నిర్వహణకు అనుకూలంగా లేవనే చెప్పాలి. అటు ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోని ప్రధాన నగరాలు కూడా ఒలింపిక్స్ నిర్వహణకు వెనుకడుగు వేస్తున్నాయి.
రేసులో పారిస్, లాస్ ఏంజిల్స్ మాత్రమే
2024 ఒలింపిక్స్ కోసం ఐదు నగరాలు రేసులో ఉన్నప్పటికీ ఇప్పటికే హాంబర్గ్, రోమ్, బుడాపెస్ట్లు తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేసులో పారిస్, లాస్ ఏంజిల్స్ మాత్రమే ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఆతిథ్యమిచ్చిన నగరాలకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని ఐఓసీ భావిస్తుండటంతో కొత్త దేశాలకు అవకాశాలు మెరుగయ్యాయి.