గయానా: 21 ఏళ్ల పాటు వెస్టిండీస్ క్రికెట్కు సేవలు అందించిన చందర్పాల్కు బోర్డు యాజమాన్యం నో చెప్పడంపై క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా స్పందించాడు. ఆయన భారత క్రికెట్ను, మాస్టర్ బ్లాస్టర్ పేరును ప్రస్తావించడం గమనార్హం.
గౌరవంగా క్రికెట్కు వీడ్కోలు పలికే అర్హత చందర్పాల్కు ఉందని, 21 ఏళ్లుగా విండీస్ క్రికెట్ కోసం అతడు ఎంతో చేశాడని లారా అన్నాడు. బోర్డు అతడి కోసం ఏం చేసిందని, అర్ధంతరంగా తప్పించడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
సచిన్ టెండుల్కర్ క్రికెట్కు చేసిన కృషికి తగినట్లుగా భారత క్రికెట్ జట్టు అతడి కోసం ఓ టెస్టు సిరీస్ను నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికిందని గుర్తు చేశాడు. కానీ విండీస్ బోర్డు మాత్రం గొప్ప ఆటగాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా, తాను మరీ మరీ అవకాశం కోసం ఏమీ అడగటం లేదని వెస్టిండీస్ క్రికెటర్ చందర్ పాల్ గురువారం నాడు చెప్పాడు. తన కెరీర్ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇలా ముగించడం తనను అసంతృప్తికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్ క్రికెట్లో మరో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో సిరీస్లో తనకు అవకాశమిస్తే గౌరవంగా క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని అతడు కోరాడు. దానిని బోర్డు వినిపించుకోలేదు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ జట్టును ఈ నెల 29న ఎంపిక చేయనున్నారు. ఐతే సిరీస్ ముందు శిక్షణ శిబిరానికి పిలిచిన 12 మంది సభ్యుల్లో 42 ఏళ్ల చందర్పాల్ లేడు. గౌరవంగా వీడ్కోలు పలికే అవకాశం తనకు ఇవ్వాలని చందర్ పాల్ కోరినప్పటికీ బోర్డు నో చెప్పింది.