హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లోకి అడుగుపెట్టింది. ఈ పదేళ్లు కూడా క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ ఎన్నో తీపి గుర్తులను అందించింది. 2008లో ఐపీఎల్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఐపీఎల్ ఆకర్షిస్తోంది.
వేసవి వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడూ క్రికెట్ మహా సంగ్రామం మొదలవుతుందా? అంటూ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ ఎన్నో మధుర స్మృతులను మిగిల్చింది. ముంబై ఇండియన్స్ జట్టు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పట్ల చూపిన ప్రేమాభిమానులు అభినందనీయం.
ప్రపంచ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేశాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. సచిన్ మీద ఉన్న ప్రేమ కొద్దీ క్రికెట్ను వీక్షించేందుకు ఎంతో అభిమానులు స్టేడియాలకు క్యూ కట్టారనేది నమ్మశక్యం లేని నిజం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్కు ప్రాతనిథ్యం వహించాడు.
టీమిండియాకు ఆడినప్పుడు అదే విధంగా ముంబై ఇండియన్స్కు ఆడిన సమయంలో కూడా సచిన్ జెర్సీ నెంబర్ 10. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న సచిన్ టెండూల్కర్ 2,000కు పైగా పరుగులు చేశాడు. 2013లో ఐపీఎల్ నుంచి వైదొలగిన సచిన్ టెండూల్కర్ అదే ఏడాది తన కెరీర్లో 200వ టెస్టు ఆడిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు కూడా వీడ్కోలు పలికాడు.
ఐపీఎల్ 10: టికెట్ల అమ్మకాలు షురూ, సచిన్ స్టాండ్ టికెట్ ధర ఎంత?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సచిన్ టెండూల్కర్ తన 200వ టెస్టు మ్యాచ్ని ఆడిన సందర్భాన్ని అభిమానులు ఇప్పటికీ గుర్తుంచుకునే ఉంటారు. సచిన్ రిటైర్మెంట్కు గౌరవ సూచకంగా ముంబై ఇండియన్స్ ఆయన నెంబర్ 10 జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించింది. దీని ప్రకారం ముంబై ఇండియన్స్ జట్టులో ఇకపై 10 నెంబర్ జెర్సీని ఎవరికి ఇవ్వరు.
ముంబై ఇండియన్స్ సచిన్కు ఇస్తున్న గౌరవం ఇదేనంటూ ముంబై ఫ్రాంఛైజీ యజమాని నీతా 2012లో ముంబై ఇండియన్స్ ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ క్లబ్ మాత్రం పదో నెంబర్ జెర్సీని అలాగే ఉంచాలని, ఎవరికీ కేటాయించొద్దని కోరుతూ అప్పట్లో దీనికోసం ట్విట్టర్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది.
ఈ ప్రచారంలో సచిన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీసీఐ కూడా భారత జట్టులో పదో నెంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించకూడదని అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. నిజానికి క్రికెట్లో ఓ జెర్సీకి వీడ్కోలు పలకడం అనేది ఇదే మొదటిసారి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అవడం వల్లే ఈ కొత్త సంప్రదాయానికి నాంది పలికారనే వాదన కూడా వచ్చింది.
2008 నుంచి 2013 వరకు సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ ఆరు ఎడిషన్లలో ముంబై ఇండియన్స్కు ప్రాతనిథ్యం వహించాడు. 2010లో 618 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ 'ఆరెంజ్ క్యాప్'ని కూడా సొంతం చేసుకున్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ని ఇస్తారు. అదే ఏడాది సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ కెప్టెన్ అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు.
ఇక 2013లో సచిన్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్తో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. ఛాంపియన్స్ లీంగ్లో ముంబై ఇండియన్స్ తరఫున చివరగు రంగు దుస్తుల్లో టి20 మ్యాచ్ ఆడిన సచిన్.. ఆఖరుగా అప్పుడే నెంబర్ 10 జెర్సీ ధరించాడు. ఛాంపియన్స్ లీంగ్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రాజస్ధాన్ రాయల్స్తో జరిగిన పైనల్ మ్యాచ్లో సచిన్ ఆఖరుగా నెంబర్ 10 జెర్సీ ధరించాడు.
ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్గా కొనసాగుతున్నారు. ఐపీఎల్ పదో సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లకు విలువైన సూచనలు చేస్తూ సచిన్ అప్పడప్పుడూ టీవీ స్క్రీన్లపై కనిపిస్తున్నారు. పదేళ్ల ఐపీఎల్లో సచిన్ పదో నెంబర్ జెర్సీ ఓ మూమెంట్గా నిలిచిపోయింది.