న్యూఢిల్లీ: అత్యుత్తమ ఫాంలో కొనసాగుతున్న భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆదివారం ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కోహ్లీ. ఈ మ్యాచ్లో గెలిచిన బెంగళూరు ప్లేఆఫ్కు చేరింది.
ప్రస్తుతం 919 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఐపిఎల్ ఒకే సీజన్లో అత్యధికంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. అందుకు ఈ ఢిల్లీకి చెందిన ఆటగాడికి మరో 81 పరుగులు అవసరమవుతున్నాయి. తదుపరి మ్యాచ్ల్లో ఈ మొత్తం పరుగులు చేసినట్లయితే టీ20 చరిత్రలోనే 1000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కనున్నాడు.
ఐపిఎల్ పాయింట్ల పట్టికలో బెంగళూరు ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలో జరిగిన అన్ని క్రికెట్ లీగ్లలో అత్యధిక పరుగులు చేసింది క్రిస్ గేల్, మైకేల్ హస్సీ. వీరు 2012, 2013 ఐపిఎల్ లీగ్ లలో 733 పరుగులు చేశారు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో మరో రెండు రికార్డులు నెలకొల్పాడు కోహ్లీ. ఢిల్లీ మ్యాచ్లో 17వ అర్థ శతకాన్ని పూర్తి చేసి, ఒకే ఏడాదిలో అత్యధిక అర్ధ శతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2012లో సాధించిన 16 అర్ధ శతకాలతో గేల్ 2వ స్థానంలో ఉన్నాడు.
అంతేగాక, ఏ టీ20 టోర్నమెంటైనా 10కిపైగా అర్ధ శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2014లో జరిగిన నట్వెస్ టీ20 బ్లాస్ట్ లో 9 అర్ధ శతకాలు సాధించాడు రాయ్.
కాగా, ప్లేఆఫ్కు చేరుకున్న బెంగళూరు జట్టు మే 24న జరగనున్న తొలి క్వాలిఫైయర్లో గుజరాత్ లయన్స్తో తలపడనుంది. ఈ రౌండ్లో ఓడిపోతే ఎలిమినేటర్ రౌండ్ ఆడాల్సి ఉంటుంది.