ఫ్లోరిడా: వెస్టిండీస్తో శనివారం చివరి క్షణం వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టి-20 మ్యాచ్లో భారత్ ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన శతకం టీమిండియాను గెలిపించలేకపోయంది. కెప్టెన్ ధోని చివరి ఓవర్ చివరి బంతికి ఔట్ కావడంతో జట్టు ఓటమి పాలైంది.
వెస్టిండీస్ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 20 ఓవర్లగానున నాలుగు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా, వెస్టిండీస్ ఇన్నింగ్స్ను జాన్సన్ చార్లెస్, ఇవిన్ లూయిస్ ధాటిగా ఆడారు.
చార్లెస్ భారత బౌలర్లపై విరుచుకుపడితే, లూయిస్ అతనికి చక్కటి మద్దతునిచ్చాడు. ఇద్దరూ 9.3 ఓవర్లలో 126 పరుగులు జోడించారు. మహమ్మద్ షమీ బౌలింగ్లో బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నించిన చార్లెస్ క్లీన్ బౌల్డ్ కావడంతో విండీస్ తొలి వికెట్ను కోల్పోయింది. అతను 33 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు.
చార్లెస్ క్రీజ్లో ఉన్నంత సేపు భారీ షాట్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఆండ్రె రసెల్ 22 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఎల్బిగా అవుటయ్యాడు. అదే ఓవర్లో లూయిస్ వికెట్ కూడా కూలింది. అశ్విన్ క్యాచ్ పట్టగా వెనుదిరిగిన లూయిస్ 49 బంతుల్లో, 5 ఫోర్లు, 9 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేశాడు.
కాగా, కీరన్ పోలార్డ్ (22), కార్లొస్ బ్రాత్వెయిట్ (14), లెండల్ సిమన్స్ (0) మ్యాచ్ చివరి ఓవర్లో అవుటయ్యారు. 20 ఓవర్లలో విండీస్ ఆరు వికెట్లకు 245 పరుగుల భారీ స్కోరు సాధించగా, అప్పటికి డ్వెయిన్ బ్రేవో (1), మార్లొన్ శామ్యూల్స్ (1) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. చార్లెస్, లూయస్ ప్రతిభతో విండీస్ 245 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద తొలి వికెట్ను ఆజింక్య రహానే రూపంలో కోల్పోయంది. అతను ఏడు పరుగులు చేసి, డ్వెయన్ బ్రేవో క్యాచ్ పట్టగా రసెల్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు.
కానీ, డ్వెయన్ బ్రేవో బౌలింగ్లో వికెట్కీపర్ ఆండ్రె ఫ్లెచర్ క్యాచ్ పట్టడంతో కోహ్లీ ఇన్నింగ్స్కు తెరపడింది. అతను కేవలం తొమ్మిది బం తుల్లోనే 16 పరుగులు చేసి, విజయంపై ఆశలు రేపినా, ఎవరూ ఊ హించని విధంగా పొరపాటు షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రాహుల్ విండీస్ బౌలింగ్పై విరుచుకుపడ్డాడు.
పోలార్డ్ వేసిన బంతిని భారీ సిక్స్గా కొట్టి రోహిత్ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. 22 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. మూడో వికెట్కు రాహుల్తో కలిసి 7.1 ఓవర్లలో 89 పరుగులు జోడించిన రోహిత్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పోలార్డ్ బౌలింగ్లో చార్లెస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.
ఈ క్రమంలో అతను 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. రోహిత్ నిష్క్రమణతో జట్టును గెలిపించే బాధ్యతను రాహుల్ అందుకున్నాడు. చక్కని షాట్లతో అలరిస్తూ బ్రాత్వెయట్ వేసిన ఓవర్లో బంతిని బౌండరీకి తరలించి రాహుల్ భారత్ స్కోరును వంద పరుగుల మైలురాయని చేరుకున్నాడు.
టీ20 కెరీర్లో అతనికి ఇదే తొలి శతకం. కాగా, రిచర్డ్ లేవీ 45 బంతుల్లో శతకాన్ని నమోదు చేసి నెలకొల్పిన రికార్డును అతను తృటిలో కోల్పోయాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ ధోని, రాహుల్ తో జతకట్టి జట్టుని విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో జట్టు గెలవడానికి చివరి ఓవర్లో ఎనిమది పరుగులు అవసరంకాగా, ఆరు పరుగులు లభించాయ.
డ్వెయన్ బ్రేవో వేసిన ఆ ఓవర్ చివరి బంతిలో శామ్యూల్స్కు దొరికిపోయన ధోనీ (43) ఔట్ కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. చివరి క్షణం వరకూ విజయం కోసం తీవ్రంగా పోరాటం సాగించి, ధోనీతో కలిసి నాలుగో వికెట్కు 8.1 ఓవ ర్లలో 107 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన రాహుల్ మొత్తం 51 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, 5 సిక్సర్ల సా యంతో 110 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
అయతే, బ్రేవో వేసిన చివరి ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని భారత్కు వ్యతిరేకంగా, విండీస్కు అనుకూలంగా మార్చేసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో వెస్టిండిస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్ ద్వారా టీమిండియా చరత్రి సృష్టించింది. టీమిండియా అధికారికంగా అమెరికాలో మ్యాచ్ ఆడుతుండటం ఇదే మొట్టమొదటిసారి.
అమెరికాలో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐసీసీ వరల్డ్ టీ20లో సెమీస్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని కరీబియన్ జట్టు కసిగా ఉంది.
అయితే గాయం కారణంగా టీ20ల స్పెషలిస్ట్ క్రిస్ గేల్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. మొదటిసారి టీ20 సిరిస్కు టీమిండియా హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లే ఉన్నారు. వెస్టిండిస్ సిరిస్కు ముందు టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన కుంబ్లే భారత్కు 2-0తేడాతో విజయం అందించాడు.
ఈ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి.
రికార్డులు:
* వెస్టిండీస్ మొదటి 10 ఓవర్లలో 132 పరుగులు సాధించింది. టి20 చరిత్రలో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఒక జట్టు మొదటి పది ఓవర్లలో చేసిన అత్యధిక స్కోరు ఇది. 2009లో ఇంగ్లాండ్పై దక్షిణాఫ్రికా సెంచూరియన్ మైదానంలో 131 పరుగులు చేయగా, విండీస్ ఆ రికార్డును ఒక పరుగు తేడాతో అధిగమించింది.
* అత్యంత వేగంగా టి-20 శతకాన్ని సాధించిన రికార్డును భారత బ్యాట్స్మన్ లోకేష్ రాహుల్ చేజార్చుకోగా, విండీస్ ఆటగాడు ఇవిన్ లూయస్ తన జట్టు తరఫున వేగంగా సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్మన్గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు.
* స్టువర్ట్ బిన్నీ ఒకే ఓవర్లో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. టి20 ఫార్మెట్లో ఒక ఓవర్లో ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలోకి వెళ్లాడు. 2007లో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్లో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లను కొట్టి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.
* భారత జట్టు మొదటి ఆరు ఓవర్లలో 78 పరుగులు సమర్పించుకుంది. టి20 చరిత్రలో భారత జట్టు భారీగా పరుగులు ఇవ్వడంలో ఇదే రికార్డు. వెస్టిండీస్కు మాత్రం మొదటి ఆరు ఓవర్లలో చేసిన అత్యధిక పరుగులు 86.
ఇండియా: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, స్టువర్ట్ బిన్నీ.
వెస్టిండిస్: కార్లోస్ బ్రాత్ వైట్ (కెప్టెన్), ఆండ్రీ ఫ్లెచర్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రేవో, లెవిస్, జాన్సన్ చార్లెస్, కీరాన్ పొల్లార్డ్, లెండిల్ సిమ్మన్స్, మార్లోన్ శామ్యూల్స్, శామ్యూల్, సునీల్ నరైన్.