అడిలైడ్: యువరాజ్ సింగ్, సురేష్ రైనాలను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందని ఆస్ట్రేలియా ట్వంటీ 20 స్కిప్పర్ ఆరోన్ ఫించ్ అన్నాడు. బాగా అనుభవం ఉన్న ఆటగాళ్లు భారత్ సొంతమని చెప్పాడు. కొద్దిరోజుల్లో జరగబోయే టీ20 టోర్నమెంట్లో వారు కీలకపాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.
అయితే తాజా టీ20 సిరీస్లో మాత్రం కొందరు భారత ఆటగాళ్ల కోసం మేము ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పాడు. ముఖ్యంగా యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలను కట్టడి చేసేందుకు అవి ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు చెప్పాడు.
యువీ, రైనాల పైన తమకు వ్యక్తిగతంగా ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు. మంచి బంతులను వారు కొట్టినా ఇబ్బంది లేదని, తమ బౌలర్లు బంతితో వారిని అవుట్ చేస్తామన్నారు. జట్టులో చాలామంది సీనియర్లు ఉంటే డ్రెస్సింగ్ రూం కొంత సానుకూలంగా ఉంటుందని చెప్పాడు.
యువీ కనీస ధర రూ.2 కోట్లు
గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ రూ.15 కోట్లకు పైగా ధర దక్కించుకుని లీగ్లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు యువరాజ్ సింగ్. నిరుడు అతణ్ని ఎంచుకున్న ఢిల్లీ ఈసారికి అతణ్ని వదిలేసింది. దీంతో మళ్లీ అతను వేలంలోకి రాబోతున్నాడు.
ఈసారి యువీ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. యువీతో పాటు కెవిన్ పీటర్సన్, షేన్ వాట్సన్, ఇషాంత్ శర్మ, నెహ్రా, దినేశ్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, సంజు శాంసన్, ధవల్ కులకర్ణి, మైకేల్ హసిలు కూడా రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నారు. ఫిబ్రవరి 5న వేలం ఉంటుంది.