న్యూజిలాండ్ ఆటగాడు లాంథమ్కు సారీ చెప్పిన పుజారా
పుజారా న్యూజిలాండ్ ఆటగాడు లాంథమ్కు సారీ చెప్పిన ఆసక్తికర సంఘటన రెండో ఇన్నింగ్స్లో చోటుచేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి, డిక్లేర్ చేసి, న్యూజిలాండ్కు బ్యాటింగ్ అప్పగించాలన్న లక్ష్యంతో టీమిండియా దూకుడు పెంచింది. దీంతో పుజారా ప్రతిబంతికీ పరుగు తీయాలనే లక్ష్యంతో ఆడారు. ఈ సందర్భంగా మూడో సెషన్ లో 45.2వ బంతిని సోధీ షార్ట్ బంతిని సంధించాడు. దీనిని షార్ట్ లెగ్ దిశగా పూజారా బలంగా కొట్టాడు. దీనిని అక్కడ క్యాచ్ అందుకునేందుకు సిద్ధంగా ఉన్న లాంథమ్ తలకు బంతి బలంగా తాకింది. అతను తలకు హెల్మెట్ ధరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో లాంథమ్కు పుజారా సారీ చెప్పాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోరు 159/1
న్యూజిలాండ్ బౌలర్ సోథీ ఒక వికెట్ తీసుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 47 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. మ్యాచ్ ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. నాలుగో రోజైన ఆదివారం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి, లంచ్ తరువాత, టీ విరామానికి ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి న్యూజిలాండ్ను రెండో ఇన్నింగ్స్ బరిలోకి దించాలని భారత్ వ్యూహంగా తెలుస్తోంది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ పైచేయి
భారత్, న్యూజిలాండ్ మధ్య గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న చారిత్రాత్మక 500వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ పైచేయి సాధించింది. తొలి రోజు భారత్ ఇన్నింగ్స్ను కివీస్, రెండో రోజు బ్యాటింగ్లో విజృంభించారు. అయితే మూడో రోజైన శనివారం న్యూజిలాండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. 152/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ను భారత స్పిన్నర్లు 95.5 ఓవర్లలో 262 పరుగులకు కట్టడి చేశారు.
110 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన కివీస్
శనివారం భారత స్పిన్నర్లను ఎదుర్కొలేని కివీస్ బ్యాట్స్మెన్లు మరో 110 పరుగులు మాత్రమే జోడించి మిగతా తొమ్మిది వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులు చేసిన ఆలౌట్ అయింది. దీంతో భారత్కు 56 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మూడో రోజు భోజన విరామ అనంతరం భారత స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలు చెలరేగిపోయారు. అశ్విన్ నాలుగు, జడేజా ఐదు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.
లాంథమ్ ఔటైన తర్వాత కివీస్ విఫలం
మూడో రోజు ఆటలో లాంథమ్(58) రెండో వికెట్గా ఔటైన తరువాత న్యూజిలాండ్ ఘోరంగా విఫలమైంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో రాస్ టేలర్ డకౌట్ గా వెనుదిరగగా, కెప్టెన్ విలియమ్సన్(75) బాధ్యతాయుతంగా ఆడాడు. కివీస్ బ్యాట్స్మెన్లలో గప్టిల్ 21, టేలర్ 0, రాంభీ 38 పరుగులు చేసి ఔట్ అయ్యారు. అయితే చివరి మూడు వికెట్లలో ఇద్దరు కివీస్ బ్యాట్స్మెన్లను డకౌట్గా పెవిలియన్ చేరుకున్నారు. ఇక భారత తన తొలి ఇన్నింగ్స్ లో 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా రెండున్నర రోజుల ఆట మిగిలి ఉంది.