హైదరాబాద్: 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యాలకు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ విచారణకు తాను కూడా మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి దయాసిరి జయశేఖర అన్నారు.
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన భారత్తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ తర్వాత 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్ తర్వాత అప్పటి లంక కెప్టెన్ సంగక్కర వెంటనే తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిందని, దీనిపై విచారణ జరపాలని అప్పటి నుంచీ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా ఆ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆరోపించాడు.
ఫైనల్ జట్టుని అప్పటి కెప్టెన్ కుమార సంగక్కర సమతూకంగా ఎంచుకోలేదని.. తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేయడం తనకి ఆశ్చర్యం కలిగించిందని రణతుంగ పేర్కొన్న సంగతి తెలిసిందే. రణతుంగ ఆరోపణలపై విచారణ సరైనదే అని లంక క్రీడామంత్రి దయసిరి జయశేఖర వ్యాఖ్యానించారు.
తనకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందగానే దీనిపై విచారణ జరిపిస్తానని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు ఆ సమయంలో శ్రీలంక క్రీడామంత్రిగా ఉన్న మహిందనంద కూడా మ్యాచ్పై అనుమానాలు ఉన్నాయని అన్నారు. చివరి నిమిషంలో టీమ్లో నాలుగు మార్పులు చేశారు.
2011 వరల్డ్ కప్ ఫైనల్ 'ఫిక్స్'?: స్పందించిన గంభీర్, నెహ్రా
జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా అనేక అనుమానాలు వచ్చాయని అన్నారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి పంపించిన సందేశాన్ని కూడా అతడు పట్టించుకోలేదు అని మహిందనంద ఆరోపించారు. అప్పుడే మ్యాచ్పై విచారణ జరిపినా.. అది మధ్యలోనే ఆగిపోయిందని ఆయన తెలిపారు.