హైదరాబాద్: మూడో వన్డే కోసం కోల్కతాకు చేరుకున్న భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొన్నారు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా చివరిదైన మూడో వన్డే కోల్కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కటక్ నుంచి బయల్దేరిన టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు కోల్కతా చేరుకున్నారు.
అక్కడి నుంచి ఈడెన్ సమీపంలో ఉన్న హోటల్కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎయిర్పోర్టు నుంచి తమకు కేటాయించిన హోటల్కు ప్రత్యేక బస్సులో బయల్దేరిన ఆటగాళ్లు సుమారు 30నిమిషాల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. నగరంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ప్రస్తుతం కోల్కతాలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు దేశాల నుంచి బిజినెస్ డెలిగేట్లు వచ్చారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ద్విశతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు కోల్కతాలోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో భద్రతా కారణాలు దృష్ట్యా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో క్రికెటర్లు వెళ్తున్న బస్సు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది. దీంతో ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 30 నిమిషాల ట్రాఫిక్లో ఆటగాళ్ల బస్సు నిలిచిపోవడంతో క్రికెటర్లను అభిమానులు గుర్తించి ఫొటోలు తీశారు.