పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వరుణుడి కారణంగా భారత్, వెస్టిండిస్ల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు రద్దైంది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కాగా, వెస్టిండీస్, భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్ ర్యాంక్ను కోల్పోయింది.
గతవారం శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా 0-3తో ఓడిపోవటంతో భారత్ మొదటి స్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవాలంటే భారత్ నాలుగో టెస్టు గెలవాల్సి ఉంది. నాలుగో టెస్టు మ్యాచ్లో తొలిరోజు 22 ఓవర్లు మాత్రమే ఆట జరగ్గా ఆ తర్వాత, వరుసగా నాలుగు రోజుల పాటు వర్షం కారణంగా ఆట రద్దు కావడంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
దీంతో టెస్టుల్లో భారత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సీరీస్ను పాక్ 2-2తో సమం చేయడంతో ర్యాంకింగ్స్ జాబితాలో పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. వెస్టిండీస్ పర్యటనలో భారత్ 2-0తో టెస్టు సిరీస్ గెలిచినా, నెంబర్ వన్ ర్యాంక్ కాపాడుకోలేకపోయింది.
మరోవైపు ఆస్ట్రేలియాను శ్రీలంక 3-0తో చిత్తు చేసి సీరీస్ను కైవసం చేసుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం పాకిస్థాన్ నెంబర్ వన్, భారత్ రెండు, ఆస్ట్రేలియా మూడో, ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 27, 28న జరగాల్సిన టీ20 మ్యాచ్ల కోసం భారత్, వెస్టిండిస్లు ఫ్లోరిడాకు బయర్దేరనున్నాయి.