జడేజాను కవ్వించిన వేడ్
రవీంద్ర జడేజా 37, సాహా 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో ఆసీస్ స్పిన్నర్ లియాన్ వేసిన 103వ ఓవర్లో కీపర్ మాథ్యూవేడ్.. జడేజాను కవ్వించాడు. జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం అలవాటులో భాగంగా తన బ్యాట్ను కత్తిసాము చేసినట్టుగా తిప్పడాన్ని వేడ్ అవహేళన చేశాడు. ‘ఎందుకు ఇలా చేస్తుంటావు? నీ ఇన్స్టాగ్రామ్లో అంతా ఇలాంటి చెత్తే ఉంటుంది' అని రెచ్చగొట్టాడు.
అంపైర్ దగ్గరికి వెళ్లిన జడేజా
వెంటనే జడేజా అంపైర్ దగ్గరికి వెళ్లి ‘తను ఆపకపోతే నేను ప్రారంభించాల్సి ఉంటుంది' అని చెప్పడంతో అంపైర్ జోక్యం చేసుకుని ఆటపై దృష్టి పెట్టండి అని హితవు పలికారు. అయినా సరే జడేజా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కెప్టెన్ స్టీవ్ స్మిత్తో పాటు వికెట్ కీపర్ వేడ్ తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
మ్యాక్స్వెల్ అవుట్ కాగానే రివ్యూ కోరిన జడేజా
ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 33వ ఓవర్లో మ్యాక్స్వెల్ అవుట్ కాగా జడేజా రివ్యూ కోరాడు. రీప్లేలో తాను అవుట్ అయినట్టు తేలగా మైదానం వీడుతున్నప్పుడు వేడ్... జడేజాతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. మధ్యలో అశ్విన్ కల్పించుకుని సముదాయించగా క్రీజులోకి వెళ్లిన వేడ్ అక్కడ విజయ్తోనూ వాదనకు దిగాడు.
పరిస్థితి సద్దుమణిగేలా చేసిన అంఫైర్లు
ఈ సమయంలో అంపైర్లు మధ్యలో కలగజేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. తొలి ఇన్నింగ్స్లో జడేజా 83 బంతులను ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో అర్ధసెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ధర్మశాల టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు.
జడేజాకు మ్యాన్ ఆఫ్ ద సిరిస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు
మరోవైపు నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్లో 25 వికెట్లు తీసిన జడేజాను మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు కూడా వరించింది. ఈ సిరిస్లో మొత్తం 127 పరుగులు చేసిన జడేజా అందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్
దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ దక్కించుకుంది. మరోవైపు స్వదేశంలో వరుసగా ఏడు టెస్టు సిరిస్లను టీమిండియా కైవసం చేసుకుంది. 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.