హైదరాబాద్: వాంఖడె స్టేడియంలో డబుల్ సెంచరీ సాధించడంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సలహా ఎంతగానో సాయపడిందని భారత టెస్టు కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు. ముంబై టెస్టు విజయంతో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-0తో భారత్ కైవసం చేసుకుంది.
ముంబై టెస్టులో కోహ్లీ (235) పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 2014లో అప్పటి టెస్టు బ్యాట్స్మెన్ నుంచి ఇప్పటి కెప్టెన్ వరకు తనను తాను మలచుకునే విధానంలో సచిన్ సలహా ఎంతగానో దోహాదపడిందని తెలిపాడు.
2014లో 10 టెస్టు ఇన్నింగ్స్లో కోహ్లీ కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. ఇలాంటి సమయంలో సచిన్ నుంచి వచ్చిన సలహా ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాడు. కొంత మంది తనను మంచి టెస్టు ప్లేయర్ కాదని చెప్పడం ద్వారా సంతోషించారని తెలిపాడు. ఈ మాటలే తనను టెస్టుల్లో రాణించే విధంగా చేశాయని అన్నాడు.
కెప్టెన్గా తాను పలు అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని, ఎవరెవరు ఏమనుకుంటున్నారో ఆలోచించేంత సమయం ఉండదని తెలిపాడు. టెస్టు సిరిస్ విజయంతో తనతో పాటు జట్టు సహచరులు, సపోర్టింగ్ స్టాప్ మద్దతు కూడా ఉందని తెలిపాడు. గత రెండున్నర సంవత్సరాలుగా టీమిండియాలో మిడిల్ ఆర్డర్ చక్కగా రాణిస్తోందని కోహ్లీ కితాబిచ్చాడు.
తాను ఫామ్లో లేనప్పుడు కూడా జట్టు విజయాల్లో తన సహాచరులు కీలకపాత్ర పోషించారని కోహ్లీ కొనియాడాడు. సమిష్టి కృషివల్లే జట్టు విజయాలను అందుకుంటోందని కోహ్లీ పేర్కొన్నాడు. తానొక్కడి వల్లే జట్టు విజయం సాధించిందని తానెప్పుడూ చెప్పబోనని కోహ్లీ తెలిపాడు.
కాగా, ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దాంతో కెప్టెన్గా అత్యధిక పరుగులు (235) చేసిన ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. అంతకముందు ధోనీ ఆస్ట్రేలియాపై 2013లో 224 పరుగులు, 1999లో సచిన్ న్యూజిలాండ్పై 217 పరుగులు, గవాస్కర్ 1978లో వెస్టిండీస్పై 205 పరుగులు సాధించారు.