హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి, ఆ తర్వాత 'వార్దా' తుఫాను చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వరుస ఘటనలతో ఇంగ్లాండ్తో జరగనున్న చివరి టెస్టు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఐదో టెస్టు వేదికను మరొక చోటికి మార్చే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి.
అయితే చెన్నైలో చివరి టెస్టు షెడ్యూల్ ప్రకారం యధావిధిగా జరుగుతుందని తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) కార్యదర్శి కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మొదలుకానున్న ఐదో టెస్టు షెడ్యూల్ ప్రకారం జరగుతుందని చెప్పారు.
చివరి టెస్టు చెన్నైలోనే: గాయం కారణంగా షమీ, సాహా దూరం
తుఫాన్ తాకిడికి నగరం దెబ్బతిన్నా.. చెపాక్ మైదానం, పిచ్కు ఎలాంటి నష్టమూ జరగలేదని ఆయన తెలిపారు. 'వార్దా తుపాను ప్రభావంతో చెపాక్ స్టేడియంలోని పిచ్, ఔట్ఫీల్డ్ దెబ్బతినలేదు. మైదానంలోని స్క్రీన్ పూర్తిగా దెబ్బతింది. ఫ్లడ్లైట్లలోని బల్బులు పేలిపోయాయి. ఎయిర్ కండిషనర్లు పాడయ్యాయి. వీటిని మరో రెండు రోజుల్లో బాగు చేయిస్తాం' అని తెలిపారు.
స్టేడియానికొచ్చే మార్గంలో వందలాది చెట్లు నేలకూలాయని చెప్పారు. రెండు రోజుల్లో వీటన్నింటిని చక్కదిద్దడం తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లతో మ్యాచ్ నిర్వహించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐదో టెస్టు చెన్నైలోనే యథావిధిగా జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇంగ్లాండ్తో డిసెంబర్ 16 నుంచి చివరి టెస్టు జరగనుంది. ముంబై టెస్టు విజయంతో ఐదు టెస్టుల సిరీస్ను ఇంకో టస్టు మిగిలుండగానే భారత్ 3-0 తేడాతో ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.