కింగ్స్టన్: వెస్టిండిస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. టీమిండియా ఓపెనర్ లోకేశ్ రాహల్ (210 బంతుల్లో 114 నాటౌట్) అద్భుత సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. గాయపడిన మురళీ విజయ్ స్థానంలో చోటు దక్కించుకున్న రాహుల్ తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.
సెంచరీ చేసే క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్స్ కొట్టి 102 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు. అయితే సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఇలా భారీ షాట్ అడడానికి గల కారణాలను రాహుల్ వివరించాడు. రాహుల్ 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు విండిస్ బౌలర్ రోస్టన్ వేసిన బంతిని సిక్స్గా మలిచాడు.
అంతేకాదు ఈ సిక్స్కు ఓ ప్రత్యేకత కూడా ఉంది. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాదిరి కేఎల్ రాహుల్ కూడా సిక్స్ కొట్టి సెంచరీని పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ మొత్తంలో ఇదే తొలి సిక్స్ కావడం విశేషం. బీసీసీఐ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో కేఎల్ రాహూల్ మాట్లాడుతూ సెంచరీకి చేరువయ్యే క్రమంలో భారీ షాట్ ఆడకూడదని చాలా మంది కోచ్లు తనతో చెప్పారని పేర్కొన్నారు.
అయినప్పటికీ తాను సెంచరీ సాధించేందుకు భారీ షాట్ లేదా స్వీప్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. బౌలర్ ఆలోచనకు అనుగుణంగా తాను ఆడటం జరిగిందని చెప్పుకొచ్చాడు. అంతక ముందు అదే ఓవర్లో రోస్టన్ షార్ట్ బంతులను వేశాడని, ఈసారి కూడా అదే విధంగా వేసి తాను ముందుకు వచ్చేలా చేసే ఆలోచనలో ఉన్నాడని పేర్కొన్నాడు.
ఇదే తనను భారీ షాట్ ఆడేలా చేసిందని చెప్పాడు. 90 పరుగుల్లో ఉన్నప్పుడు తాను ఎంజాయ్ చేయలేకపోయానని, అందుకు ఈ ఒత్తిడి నుంచి త్వరగా బయటపడాలనే ఉద్దేశంతో భారీ షాట్కు ప్రయత్నించానని చెప్పాడు. 2004లో పాకిస్థాన్పై సక్లయిన్ ముస్తార్ బౌలింగ్లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీని సిక్స్తోనే పూర్తి చేశాడు.
అంతక ముందు 2003లో 195 పరుగుల వద్ద ఉన్న సెహ్వాగ్ క్రీజులో ఉన్నప్పుడు సిక్స్కు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు. కాగా వెస్టిండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని టెస్ట్ కెరీర్లో కేఎల్ రాహుల్ మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
శతకంతో చెలరేగిన రాహుల్: విండీస్పై 162 పరుగుల ఆధిక్యం
కర్ణాటకకు చెందిన ఈ 24 ఏళ్ల టీమిండియా యువ బ్యాట్స్మన్ సాధించిన మూడు సెంచరీలు కూడా విదేశీ గడ్డపైనే కావడం విశేషం. 126/1 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 162 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
శిఖర్ ధావన్ 27 పరుగులతో జట్టు స్కోరు 87 పరుగుల వద్ద తొలి వికెట్ చేజార్చుకున్న టీమిండియాను పుజారా(38 నాటౌట్)తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 107 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.