న్యూఢిల్లీ: క్రికెట్ను ఓ కెరీర్ ఆప్షన్గా ఎంచుకోమని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారంటూ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం అన్నారు. ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ గ్లోబల్ స్పోర్ట్స్ సమ్మిట్లో పాల్గొన్న కపిల్ దేవ్ మాట్లాడుతూ ఓ క్రికెటర్ 40 రోజుల్లో 10 కోట్ల రూపాయలను సంపాదించగలుగుతున్నాడని పరోక్షంగా ఐపీఎల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఈ తరం యువత క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి వారి తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తున్నారన్నారు. క్రికెట్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాందించే అవకాశం రావడం ఎంతో మంచి పరిణామమని అన్నారు. కాలంతో పాటు ప్రపంచ క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు.
'పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతే కనీసం క్రికెట్ ఆడాలి. సచిన్ టెండూల్కర్ లేదా రాహుల్ ద్రవిడ్ వంటి గొప్ప క్రికెటర్ కావాలి' అని కపిల్ అన్నాడు. స్పోర్ట్స్ అభివృద్ధికి అవసరమైన మౌళిక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాలని, మైదానాలతో పాటు ఆటలకు సంబంధించిన అన్ని వస్తువులపై పన్ను తగ్గించాలని కోరారు.