హైదరాబాద్: కుంబ్లే రాజీనామా వ్యవహారాన్ని బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదనే అభిప్రాయాన్ని టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యక్తం చేశాడు. ఏడాది పాటు టీమిండియా కోచ్గా పని చేసిన అనిల్ కుంబ్లేని బీసీసీఐ అవమానకర రీతిలో పంపించిన సంగతి తెలిసిందే.
ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో గౌతం గంభీర్ మాట్లాడాడు. భారత క్రికెట్కు ఎంతో సేవ చేసిన అనిల్ కుంబ్లేకు తగినంత గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కుంబ్లే వ్యవహారంలో బీసీసీఐ మరింత హుందాగా వ్యవహరించి ఉండాల్సిందని పేర్కొన్నాడు.
టీమిండియా కోచ్ పదవి నుంచి కుంబ్లే వైదొలిగే క్రమంలో అతనికి సముచిత గౌరవం దక్కలేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు మాజీ కెప్టెన్గా, కోచ్గా బీసీసీఐ నుంచి తగినంత గౌరవం పొందేందుకు అన్ని విధాలా అర్హుడని కొనియాడాడు.
'కుంబ్లే రాజీనామా వ్యవహారాన్ని బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదు. అనిల్ కుంబ్లేకి మరింత ఎక్కువ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత బీసీసీఐది. ఒక క్రికెటర్గా అతను ఎంతో చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కోచ్గా కుంబ్లే వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది అనే దానిపై లోతైన విశ్లేషణ అనవసరం' అని గంభీర్ పేర్కొన్నాడు.
'అతని వ్యవహారంలో బీసీసీఐ ప్రొఫెషనల్గా వ్యవహరిస్తే బాగుండేది. కుంబ్లేను గౌరవంగా సాగనంపడంలో బీసీసీఐ విఫలమైంది. ఈ తరహా విధానం బీసీసీఐ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కోచ్ కుంబ్లేనా లేక రవిశాస్త్రినా అన్నది ముఖ్యం కాదని, టీమిండియా విజయం సాధించడమే ఇక్కడ ముఖ్యం' అని గంభీర్ పేర్కొన్నాడు.
ఇక కోచ్ను ఎంపిక చేసి విషయంలో ఆటగాళ్ల పాత్ర అనవసరమని గంభీర్ సూచించాడు. కోచ్ ఎంపిక అనేది క్రికెటర్ల ఉద్యోగం కాదని గంభీర్ పేర్కొన్నాడు. కోచ్ ఎంపిక ప్రక్రియలో ఆటగాళ్లు కలగజేసుకుంటే అది మరింత ఒత్తిడిని పెంచుతుందని, కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ చేస్తే మంచిదని అన్నాడు.