హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ ఒకడు. అలాంటి డివిలియర్స్ ఓ సంచలన ప్రకటన చేశాడు. ఆగస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో భేటీ అయి తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించాడు.
33 ఏళ్ల డివిలియర్స్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. అయితే అతడి నేతృత్వంలోని సఫారీల జట్టు వరుస ఓటములను ఎదుర్కొంటోంది. అత్యంత ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సైతం గ్రూప్ దశలోనే దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది.
ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ, టీ20 సిరీస్లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. 2-1 తేడాతో టీ20 సిరీస్ను కోల్పోయింది. టీ20 సిరిస్ ఓటమి అనంతరం డివిలియర్స్ కాస్తంత ఉద్వేగంగా మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం తనకు లభించిన విశ్రాంతి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు తెలిపాడు.
సెప్టెంబర్లో బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు రానుంది. అప్పటిలోగా తన క్రికెట్ భవిష్యత్తు ఏమిటో తేలిపోనుందని చెప్పాడు. 'నేను ఆగస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో భేటీ అయి నా (అంతర్జాతీయ క్రికెట్) భవిష్యత్తుపై చర్చిస్తాను' అని ఏబీ పేర్కొన్నాడు.
కొన్ని మ్యాచ్లు ఆడటం.. విశ్రాంతి తీసుకోవడం అన్న తరహాలో కాకుండా రానున్న సంవత్సరాల్లో ఏం చేయాలనే విధంగా తుది నిర్ణయం తీసుకుంటానని డివిలియర్స్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాకు వరల్డ్ కప్ అందించాలన్నది తన కల అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు.
అయితే, అది తాను జట్టులో భాగంగా ఉండి అందించవచ్చు లేదా పరోక్షంగా సేవలు అందించి దానిని సాధించవచ్చని తెలిపాడు. కోచ్తో పాటు బోర్డుతో సంప్రదించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని డివిలియర్స్ అన్నాడు. 106 టెస్టులు ఆడిన డివిలియర్స్ 21 సెంచరీలతో ఎనిమిది వేలకుపైగా పరుగులు చేశాడు.