హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్లో డివిలియర్స్ గతంలో మాదిరి రాణించాలంటే దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సూచించాడు. బ్రిటీష్ డైలీకి రాసిన ఓ కథనంలో డివిలియర్స్ టెస్టులకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు స్మిత్ పేర్కొన్నాడు.
ఆగస్టులో క్రికెట్ దక్షిణాఫ్రికాతో చర్చించి తన క్రికెట్ భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు డివిలియర్స్ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జరగనున్న బంగ్లాదేశ్ పర్యటనకు ముందే టెస్టులకు డివిలియర్స్ ప్రకటించి.. పరిమిత ఓవర్ల క్రికెట్పైనే తన పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుందని స్మిత్ చెప్పాడు.
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఏబీ డివిలియర్స్ నాయకత్వంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఘోరంగా విఫలమైంది. అనంతరం ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ని కూడా ఆ జట్టు 1-2తో దక్షిణాఫ్రికా చేజార్చుకున్న సంగతి తెలిసిందే. [డివిలియర్స్ సంచలన నిర్ణయం: ఆగస్టులో క్రికెట్కు గుడ్బై!]
'గత ఏడాది ఒకనొక దశలో డివిలియర్స్ టెస్టులకు గుడ్బై చెబుతాడని భావించా. కానీ బోర్డు కొనసాగాలని కోరడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు' అని స్మిత్ పేర్కొన్నాడు. ఇప్పుడు తన క్రికెట్ కెరీర్ను మరింత కాలం పొడిగించు కోవాలంటే డివిలియర్స్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాలని సూచించాడు.
ఈ రెండేళ్ల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్పైనే దృష్టిసారించాలని స్మిత్ సలహా ఇచ్చాడు. 'వన్డే వరల్డ్ కప్కి మరో రెండేళ్లు మాత్రమే గడువు ఉంది. ఈ టోర్నీలో డివిలియర్స్ స్వేచ్ఛగా ఆడాలంటే అతనికి ఎలాంటి బాధ్యతలు ఉండకూడదు. ప్రస్తుతం వన్డే కెప్టెన్సీ అతనిపై అదనపు భారాన్ని మోపుతోంది. అందుకే మునుపటిలా అతను భారీ స్కోర్లు చేయలేక పోతున్నాడు' అని స్మిత్ అన్నాడు.
మరోవైపు ఇప్పటికే గాయాలు, ఒత్తిడి కారణంగా టెస్టు క్రికెట్కి ఏడాది నుంచి దూరంగా ఉంటున్న డివిలియర్స్ పరిమిత ఓవర్ల క్రికెట్కి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని స్మిత్ పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలే అతడ్ని స్వేచ్ఛగా ఆడనీయట్లేదని గ్రేమ్ స్మిత్ వివరించాడు.