హైదరాబాద్: ఐర్లాండ్, ఆప్ఘనిస్థాన్ ఎట్టకేలకు టెస్టు హోదాను సంపాదించాయి. నిజానికి ఓ దేశానికి టెస్టు హోదా రావాలంటే ఎంతో కష్టం. ఆ జట్టు స్థిరమైన ఆట, సంచలన విజయాలను నమోదు చేసి ఉండాలి. అయితే ఈ మధ్య కాలంలో ఆప్ఘనిస్ధాన్, ఐర్లాండ్ ఆ దిశగా సఫలం కావడంతో ఐసీసీ ఆ రెండు దేశాలకు టెస్టు హోదా కల్పించింది.
ఇప్పటి వరకూ పది దేశాలకు టెస్టు హోదా ఉంది. దాదాపు 17 సంవత్సారాల అనంతరం మరో రెండు దేశాలు ఈ జాబితాలో చేరాయి. చివరిసారిగా బంగ్లాదేశ్ 2000లో టెస్టు హోదా పొందింది. గురువారం ఐసీసీ ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ దేశాలకు టెస్టు హోదా కల్పించింది. లండన్లోని ది ఓవల్ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఐసీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇప్పటివరకు టెస్టు మ్యాచ్లు ఆడే దేశాలు పది ఉండగా, ఇప్పుడా సంఖ్య 12కు పెరిగింది. ఇటీవలే వెస్టిండీస్తో వన్డే సిరీస్ను అప్ఘనిస్థాన్ జట్టు 1-1తో డ్రా చేసుకుంది. 2011లో వన్డే హోదా పొందిన ఆ జట్టు 2015లో వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు సంపాదించింది.
ఇక 2007లో వన్డే హోదా పొందిన ఐర్లాండ్.. అదే ఏడాది ప్రపంచకప్లో తన ఆటతో అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మెన్ డేవిడ్ రిచర్డ్సన్ రెండు జట్లకు శుభాకాంక్షలు తెలిపాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, జింబాంబ్వే, బంగ్లాదేశ్లు టెస్టు హోదా కలిగి ఉన్నాయి.