హైదరాబాద్: గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు చివరి నుంచి రెండో స్ధానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదైన తమ దశ తిరగాలని భావిస్తున్న పూణె జట్టు పదో సీజన్ ముందు పలు కీలక మార్పులు చేసింది.
ఇందులో భాగంగా ఇప్పటికే ధోనీకి గుడ్బై చెప్పి స్మిత్కు కెప్టెన్సీ అప్పగించిన ఆ జట్టు తాజాగా టీమ్ పేరులో చిన్న మార్పు చేసింది. గత సీజన్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్గా ఉన్న పేరును ఈసారి రైజింగ్ పుణె సూపర్జెయింట్గా మార్చింది.
ఈ మేరకు ఎస్ అనే అక్షరాన్ని తొలగిస్తున్నట్లు తాజాగా పేర్కొంది. ఈ ఒక్క అక్షరాన్ని తొలగించడమే తకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని జట్టు భావిస్తోంది. ఇక నుంచి పూణె సూపర్ జెయింట్గానే తమ ఫ్రాంచైజీ పేరు ఉంటుందని ఆ జట్టు అధికారి ప్రతినిధి ఒకరు తెలిపారు.
అయితే ఈ మార్పు వెనుక ఎలాంటి మూఢనమ్మకాలు లేవని ఆయన అన్నారు. 'గతేడాది మా జట్టులో నాలుగు నుంచి ఐదుగురు ఆటగాళ్లలో మాత్రమే సూపర్ జెయింట్ లక్షణాలను చూశాం. అయితే ఈఏడాది మొత్తం జట్టునే సూపర్ జెయింట్ గా చూడాలనుకుంటున్నాం. అందుచేత 'సూపర్ జెయింట్' గా బరిలోకి దిగుతున్నాం' అని ఆయన స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2016 సీజన్లో అరంగేట్రం చేసిన పూణె 14 మ్యాచుల్లో కేవలం ఐదింట్లో మాత్రమే గెలిచి ఏడోస్థానంతో సరిపెట్టుకుంది. ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో పూణె తన తొలి మ్యాచ్ను ఆడనుంది.