హైదరాబాద్: టీమిండియాకు ఆడేటప్పుడు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించేందుకు తాను సిద్ధమేనని టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరిస్లో ధర్మశాలలో జరిగిన చివరి టెస్టుకి రహానే కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో కనీసం తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం 12వ ఆటగాడిగానే ఉన్న రహానె మైదానంలోని ఆటగాళ్లకి డ్రింక్స్ అందిస్తూ కనిపించాడు. ఆ తర్వాత విండిస్ పర్యటనలో రహానే ఓపెనర్గా రాణించాడు.
ఈ క్రమంలో టెస్టు జట్టుకు వైస్కెప్టెన్గా ఉన్న మీరు తుది జట్టులో చోటు దక్కించుకోలేక పోయారు, ఆటగాళ్లు కోసం డ్రింక్స్ కూడా మోశారు. దీనిని ఇబ్బందిగా ఫీలయ్యారా? అని విలేకరులు ప్రశ్నించగా తనదైన శైలిలో రహానె సమాధానమిచ్చాడు.
'భారత టెస్టు జట్టుకి నేను వైస్ కెప్టెన్. అంతమాత్రాన వన్డే జట్టులో 12వ ఆటగాడిగా బాధ్యతలు నిర్వర్తించకూడదని లేదు కదా? ఆ క్షణంలో భారత్ జట్టుకి నేను ప్రాతినిథ్యం వహిస్తున్నాను. కాబట్టి నాకు అప్పగించిన పనిని నేను చేశాను. అందుకే ఎలాంటి అహం దరి చేరనీయకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో డ్రింక్స్ మోశాను. ఇదే నా వ్యక్తిత్వం' అని రహానే అన్నాడు.
ఇదిలా ఉంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం అటు నుంచి అటే నేరుగా టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. విండిస్ పర్యటనలో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుకి దూరమవడంతో అవకాశం దక్కించుకున్న రహానే మొత్తం ఐదు వన్డేల్లో 336 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇందులో ఒక సెంచరీ మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక వెస్టిండిస్ సిరిస్ తనకు ఎంతో ప్రత్యేకమైన సిరిస్ అని రహానే చెప్పాడు. మూడు మ్యాచ్ల్లో రాణించడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.