హైదరాబాద్: ఫిబ్రవరి 9 నుంచి బంగ్లాదేశ్తో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా మిశ్రా ఈ టెస్టుకు దూరమవడంతో అతడి స్ధానంలో యువ ఆటగాడు కుల్దీప్ యాదవ్కు చోటు కల్పించారు.
ఇంగ్లాండ్తో ఫిబ్రవరి 1న జరిగిన చివరి టీ20లో అమిత్ మిశ్రా ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో మిశ్రా మోకాలికి గాయమైందని, దీంతో అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్కు చోటు కల్పించినట్లు బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.
NEWS ALERT - Kuldeep Yadav replaces injured Amit Mishra in #TeamIndia for Bangladesh @Paytm Test match #INDvBAN
— BCCI (@BCCI) 7 February 2017
22 ఏళ్ల కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు టీమిండియా సీనియర్ జట్టు తరుపున ఆడలేదు. అండర్ 19, ఇండియా ఏ జట్లు తరుపున టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా బంగ్లాదేశ్తో ముగిసిన వార్మప్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు (1/32, 2/2) తీసుకున్నాడు.
గత నెలలో ఇంగ్లాండ్తో ముంబైలో జరిగిన వార్మప్ మ్యాచ్లో 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అక్టోబర్, 2014లో వెస్టిండిస్ సిరిస్ కోసం తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుని నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. ఇంగ్లాండ్తో టెస్టు, వన్డే, టీ20 సిరిస్లను గెలుచుకుని టీమిండియా మంచి జోరు మీదుంది.