హైదరాబాద్: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను తక్షణమే అమలు చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. లోథా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీం తొలగించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆల్ ద బెస్ట్ అంటూ వ్యంగం: వేటుపై అనురాగ్ ఠాకూర్ స్పందన
'సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడంలో ఎలాంటి గందగోళం లేదు. ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా సంఘంలో సంస్కరణలు వెంటనే అమలు చేస్తాం. కూలింగ్ పీరియడ్ నిబంధన కూడా మాకు వర్తిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటాం' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన వివరించారు.
'బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే గౌరవంగా భావిస్తాను. నిబంధనలకు లోబడి నిజాయతీతో బాధ్యతలు నిర్వర్తిస్తా. డీడీసీఏకి చెందిన సీకే ఖన్నా సైతం సీనియర్ ఉపాధ్యక్షుడు. ఆయనకూ అవకాశం రావచ్చని' గోకరాజు గంగరాజు తెలిపారు.
సుప్రీం కోర్టు తీర్పు మేరకు ముందే లోధా సిఫారసులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించగా గతంలో బోర్డు ప్రయోజనాలను కాపాడేందుకే లోధా సిఫారసులను అమలు చేయలేదని, తాజాగా తీర్పు వచ్చింది కాబట్టి దానిని ఉల్లంఘించలేమని అన్నారు.
అనురాగ్ ఠాకూర్ తొలగింపు: ట్విట్టర్లో ఎవరేమన్నారు?
ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు 19 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయని, త్వరలోనే రెండో అతిపెద్ద అంతర్జాతీయ స్టేడియం రాబోతుందని ఆయన తెలిపారు. కాగా విదర్భ, త్రిపుర, హైదరాబాద్, రాజస్థాన్ సంఘాలు మాత్రమే జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
కాగా, లోధా సిఫారసులను అమలు చేస్తామని బీసీసీఐలోని ఇతర ఆఫీసు బేరర్స్, అన్ని రాష్ట్ర సంఘాలు వ్యక్తిగత అఫిడవిట్లను దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తాము ఆమోదించిన లోధా అన్ని నిబంధనలను అందరూ విధిగా పాటించాలని, వ్యతిరేకించిన వారిని పదవుల నుంచి తొలిగించాలని హెచ్చరించింది.
దీంతో 70 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు అటు బీసీసీఐలోగానీ, ఇటు రాష్ట్ర సంఘాల్లోగానీ పదవులు చేపట్టేందుకు అనర్హులు. గత తొమ్మిదేళ్లుగా పదవుల్లో కొనసాగుతున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు వెంటనే వాటికి రాజీనామా చేయాలి. క్రికెట్ పదవుల్లో ఉన్నవారు ఇక వేరే క్రీడా సమాఖ్యల్లో కూడా పదవులు తీసుకోకూడదు.