త్వరలో భేటీ కానున్న క్రికెట్ సలహా కమిటీ
మరో వైపు ఇంటర్యూ ప్రక్రియ, తేదీలను ఖరారు చేసేందుకు గంగూలీ, సచిన్, లక్ష్మణ్లతో కూడిన బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ త్వరలోనే సమావేశం కానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసేలోపు కోచ్ ఎంపిక ప్రక్రియను ముగించాలన్నది బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ పదవి కోసం అభ్యర్థులను ఈ కమిటీ ఇంటర్వ్యూ చేయనుంది. అయితే తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ క్రెయిగ్ మెక్డెర్మాట్ కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాడు. అయితే నిర్ణీత గడువు మే 31 దాటిన తర్వాత అతడి అప్లికేషన్ బీసీసీఐకి అందింది.
కోచ్ రేసులో ఆసీస్ మాజీ పేసర్ క్రెయిగ్ మెక్డెర్మాట్
దీంతో అతని దరఖాస్తును చూసిన తర్వాత క్రికెట్ సలహా కమిటీలోని సభ్యులు చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, గతేడాది కాలంగా టీమిండియాకు ఎన్నో విజయాలనందించి విజయవంతమైన కోచ్గా పేరు తెచ్చుకున్న కుంబ్లే కాంట్రాక్టును పొడిగించడం లాంఛనమే అనుకుంటున్న దశలో కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.
కుంబ్లే వ్వవహార శైలిపై అటగాళ్ల అసంతృప్తి
కుంబ్లే మరీ కఠినంగా ఉంటున్నాడని, అతడితో అసౌకర్యంగా ఉందని కెప్టెన్ కోహ్లీతో పాటు కొందరు ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీసీసీఐ ఈ ప్రకటన చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయమమై ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు ఆటగాళ్లతో గంగూలీ నేరుగా మాట్లాడాడు. ఆటగాళ్ల నుంచి ప్రస్తుత కోచ్ కుంబ్లే వ్యవహార శైలిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు.
ఇంగ్లాండ్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం
కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే కొనసాగించేది లేనిది జట్టు సభ్యుల ఫీడ్బ్యాక్పైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. మరోవైపు కోచ్ పదవికోసం మాజీ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్, సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్మూడీ, లాల్చంద్ రాజ్పుట్, దొడ్డా గణేశ్, రిచర్డ్ పైబస్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త కోచ్ కోసం క్రికెట్ సలహా కమీటీ ఇంగ్లాండ్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది.