హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకోవడం అనిల్ కుంబ్లే వ్యక్తిగత నిర్ణయమని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోల్కతాకు చేరుకున్న గంగూలీ గురువారం మీడియాతో మాట్లాడాడు.
'చివరి నిమిషంలో కుంబ్లే రాజీనామా చేశారు. అది తన వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో నేను మాట్లాడాల్సిందేమీ లేదు' అని గంగూలీ తేల్చి చెప్పారు. ఇక కోహ్లీ, కుంబ్లేల మధ్య విభేదాల గురించి మాట్లాడేందుకు గంగూలీ నిరాకరించాడు.
'భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరే కొన్ని రోజుల ముందు కోహ్లీ-కుంబ్లేతో ఏకకాలంలో చర్చలు నిర్వహించాం. ఆ సమయంలో కుంబ్లే కొన్ని పేపర్ల పట్టుకుని వచ్చాడు. అప్పటికే ఇద్దరి మధ్య వివాదాలు ముదరడంతో కోచ్గా కొనసాగడం కష్టమని కుంబ్లే తెలిపాడు' అని గంగూలీ చెప్పాడు.
క్యూలో నిలబడను, కోచ్ పదవి ఇస్తానంటే అప్లై చేస్తా!: బీసీసీఐతో శాస్త్రి
కోచ్గా తన పద్ధతులపై కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లేతో కోహ్లీకి సయోధ్య కుదిర్చేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే కుంబ్లే ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కోచ్గా కుంబ్లే రాజీనామాని ఆమోదించిన బోర్డు కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. కొత్తగా మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 7-10 రోజులు అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సరైన అర్హత, అనుభవంతో పాటు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. టీమిండియా ప్రధాన కోచ్ పదవి రేసు నుంచి కుంబ్లే తప్పుకోవడంతో తాజాగా తెరపైకి రవిశాస్త్రి పేరు వచ్చింది. ఆగస్టు 2014 నుంచి ఏప్రిల్ 2016 వరకు రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్గా పని చేసిన అనుభవం ఉంది.
2015లో అప్పటి కోచ్ డంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగిసిన తర్వాత శాస్త్రిని బీసీసీఐ టీమిండియా డైరెక్టర్గా నియమించింది. కాగా, బీసీసీఐ మే 31లోపు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్చంద్ రాజ్పుత్, రిచర్ పైబస్, దొడ్డ గణేశ్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
కొత్త ట్విస్ట్: సెహ్వాగ్కు కోచ్ పదవి కష్టమే, కారణం ఇదీ
అప్పడు రవిశాస్త్రి దరఖాస్తు చేయలేదు. అయితే ఇప్పుడు రవిశాస్త్రిని కూడా కోచ్ పదవి కోసం అప్లై చేసుకోమని బీసీసీఐ కోరింది. అప్లై చేస్తా కానీ.. నాకు కోచ్ పదవి కావాలని అందరిలాగా క్యూలో నిలబడను.. కచ్చితంగా నాకే ఆ పదవి ఇస్తా అంటేనే చేస్తానని తేల్చి చెప్పినట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ త్వరలోనే ఇంటర్యూలు నిర్వహించనుంది. మరోవైపు జులై చివర్లో మొదలయ్యే శ్రీలంక పర్యటన లోపు కొత్త కోచ్ ఎంపికను మాత్రం పూర్తి చేస్తామని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టంచేశారు. కొత్త కోచ్ 2019 వరల్డ్కప్ వరకు ఉంటాడని కూడా ఆయన చెప్పారు.