కోహ్లీ వల్లే కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా
కోహ్లీ వల్లే తాను కోచ్ పదవికి రాజీనామా చేశానని కుంబ్లే ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్టు చేసినప్పటికీ, ఇద్దరి మధ్య విభేదాలపై కోహ్లీ మాత్రం ఇప్పటివరకు స్పందించక పోవడం విశేషం. మరోవైపు ఆటగాళ్ల పట్ల కుంబ్లే తీరుపై కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనతో పాటు జట్టు ఆటగాళ్ల పట్ల హెడ్ మాస్టర్లా వ్యవహరించడం వల్లే ఇద్దరి మధ్య విభేదాలు మరింతగా ముదిరాయని అంటున్నారు.
డ్రెస్సింగ్ రూమ్పై కూడా ఇద్దరి మధ్య గొడవ
దీంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ ఎవరి ఆధీనంలో ఉండాలన్న విషయం ఇద్దరి మధ్యా గొడవలను మరింత పెంచిందని అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య గత ఆరు నెలలుగా మాటలు లేవని తెలిసి బీసీసీఐ కూడా షాక్కు గురైంది. బీసీసీఐ వర్గాల ప్రకారం.. డిసెంబర్లో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. అప్పట్నించే వీరిద్దరూ పరస్పరం మాట్లాడుకోవడం మానేశారు.
విభేదాలు పరిష్కరించడంలో చేతులెత్తేసిన సీఏసీ
కుంబ్లే, కోహ్లీల మధ్య విభేదాలు పరిష్కరించడంలో సీఏసీ చేతులెత్తేయడంతో బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా బీసీసీఐ జట్టు సభ్యులతో హోటల్లో మూడు సమావేశాలు నిర్వహించింది. తొలి సమావేశంలో కుంబ్లే.. బీసీసీఐ ఉన్నతాధికారులు, సీఏసీ సభ్యులను కలుసుకున్నాడు.
కోహ్లీతో సమస్య లేదని చెప్పిన కుంబ్లే
చర్చల సందర్భంగా కోహ్లీతో తనకు ఎలాంటి సమస్య లేదని కుంబ్లే చెప్పాడు. తన కోచింగ్పై కోహ్లీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, ఇవి పెద్ద సమస్యలు కావని తేల్చాడు. ఆ తర్వాత కోహ్లీ వారిని కలిశాడు. ఇక మూడో సమావేశంలో కుంబ్లే, కోహ్లీలను టేబుల్కు ఎదురెదురుగా కూర్చోపెట్టారు. ఏదైనా సమస్య ఉందా? అని అడిగినప్పుడు ఇద్దరూ భిన్న సమాధానాలిచ్చారు. కోహ్లీతో తనకేమీ ఇబ్బంది లేదని కుంబ్లే చెప్పాడని బోర్డు అధికారి తెలిపాడు.